ఇదీ పరిస్థితి, అందుకే నాకు అండగా ఉండండి: పవన్ కళ్యాణ్, నిజాలు తెలుసుకో: నారా లోకేష్
శ్రీకాకుళం/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో ఇది కనిపిస్తుందని, తమ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు శ్రీకాకుళం ప్రజలు బ్రహ్మరథం పట్టారని, తద్వారా మార్పుకు శ్రీకారం చుట్టాలని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం బుదవారం అన్నారు.
ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. పవన్ సత్తా తెలుసు కాబట్టే గత ఎన్నికల్లో టీడీపీ ఆయన మద్దతు తీసుకుందన్నారు. జనసేనకు ఒక్క శాతం ఓట్లే పడతాయని చంద్రబాబు ఇటీవల అన్నారు. దీనికి పైవిధంగా కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందన్నారు.

పవన్ కళ్యాణ్పై ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు
ప్రజలు పవన్ కళ్యాణ్ పైన సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని మాదాసు చెప్పారు. తమ పార్టీ అధ్యక్షులు శ్రీకాకుళంలో ప్రజలతో మాట్లాడి వారి సమస్యల మూలాలు, పాలకుల నిర్లక్ష్య ధోరణిని గ్రహించారని చెప్పారు. సమస్యలను అవగాహన చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ జనసేన పోరాట యాత్ర చేపట్టారని తెలిపారు. కాగా, పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా పర్యటన మంగళవారం ముగిసింది. అనంతరం విజయనగరం జిల్లాకు బయలుదేరారు. గురువారం నుంచి విజయనగరం జిల్లాలో పర్యటిస్తారు. తన పర్యటనలో ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

శ్రీకాకుళం జిల్లాకు పవన్ మాత్రం అండగా ఉంటారు
మంగళవారం నాటి శ్రీకాకుళం సభలో మంత్రి అచ్చెన్నాయుడితో సహా కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజు, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద రావు వంటి పేర్లను ఉటంకించారు. ఏ జిల్లాకు లేనన్ని వనరులు, అవకాశాలు శ్రీకాకుళంలో ఉన్నా పాలకుల నిర్లక్ష్యం వల్లనే వెనకబాటుకు గురైందన్నారు. శ్రీకాకుళానికి టీడీపీ ఎంత చేస్తుందో, వైసీపీ నేతలు ఎంత చేస్తారో గానీ.. ఈ జిల్లాకు పవన్ కళ్యాణ్, జనసేన మాత్రం ప్రజలకు అండగా ఉంటారన్నారు.

అందుకే మీరు నాకు అండగా ఉండాలి
1970లో నాటి నాయకులు అప్పయ్య దొర శ్రీకాకుళంలో రైల్వే స్టేషన్ కావాలని అడిగారని, విజయవాడ, గుంటూరు ఇలా ఏ జిల్లా కేంద్రమైనా రైల్వే స్టేషన్లు లేకుండా ఉన్నాయా అని, శ్రీకాకుళం కేంద్రంలో మాత్రమే మనకు కనిపించదని, ఆమదాలవలస వెళ్లి రైలు ఎక్కాలన్నారు. అప్పయ్యదొర తర్వాత శ్రీకాకుళంలో రైల్వే స్టేషన్ పెట్టమని అడగడానికి ఒక్కనాయకుడు లేరన్నారు. అందుకే మీరు నాకు అండగా నిలబడాలని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

పవన్ నిజాలు తెలుసుకొని మాట్లాడాలి
కాగా, ఉద్ధానం సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. పవన్ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కిడ్నీ సమస్య ఉన్న ప్రాంతాల్లో ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. 80 గ్రామాల్లో 238 నివాస ప్రాంతాలకు తాగునీరు అందిస్తున్నామని, 136 రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 4 నెలల్లో 15 మొబైల్ టీమ్స్తో లక్షమందికి స్క్రీనింగ్ టెస్టులు చేశామన్నారు. చంద్రన్న సంచార వాహనాల ద్వారా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని, సోంపేటలో నూతన ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు. కిడ్నీ వ్యాధి బాధితులకు రూ.2500 పెన్షన్ ఇస్తున్నామని, పవన్ క్షేత్రస్థాయిలో నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు.












Click it and Unblock the Notifications