పవన్ కళ్యాణ్ ఇచ్చేనా?: కేసీఆర్పై కోపమా? ఘాటుగా..
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర సర్వేలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. అయితే, మరో దఫా జరిగే సర్వేలో వివరాలు ఇస్తారా అనే చర్చ సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు పలికారు.
ఎన్నికల సమయంలోనే పవన్ కళ్యాణ్ నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సమయం వచ్చినప్పుడల్లా అతని పైన ఎగిరిపడ్డారు. తెలంగాణలో తెరాస గెలిచిన తర్వాత పవన్ స్పందిస్తూ.. ఇప్పటికైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు.

ఎన్నికల ప్రచారం సమయంలో తెలంగాణలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. తెరాస పైన, కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు. కేసీఆర్ కూడా ధీటుగా స్పందించారు. గాలికి కొట్టుకుపోతాడంటూ పవన్ను హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇరువురు పరస్పరం ఘాటైన విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు సర్వేలో పవన్ కళ్యాణ్ పాల్గొనక పోవడం చర్చనీయాంశమైంది.
అదే సమయంలో విజయశాంతి కూడా సర్వేలో పాల్గొనక పోవడం చర్చకు దారి తీసింది. తెలంగాణ బిడ్డగా విజయశాంతి చెప్పుకుంటారు. సర్వేలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుండి సైతం ప్రజలు వచ్చారు. అలాంటిది తెలంగాణ బిడ్డగా చెప్పుకోవడమే కాకుండా, తెలంగాణ కోసం ఉద్యమించిన విజయశాంతి పాల్గొనక పోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.
విజయశాంతి ఎన్నికలకు ముందు తెరాసలో ఉన్నారు. 2009లో తెరాస తరఫునే ఆమె మెదక్ లోకసభ నుండి గెలుపొందారు. కేసీఆర్తో విభేదాల వల్ల ఆమె బయటకు వచ్చారు. విజయశాంతి, పవన్ కళ్యాణ్లు కేసీఆర్ పైన ఉన్న వ్యతిరేకతతోనే సర్వేలో పాల్గొనకపోవచ్చుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో.. వ్యక్తిగత కారణాల వల్ల కూడా వారు పాల్గొనక పోవచ్చుననే వారు లేకపోలేదు. ఒకవేళ సమగ్ర సర్వేను వారు వ్యతిరేకిస్తే అందుకు కారణాలను వెల్లడించి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. లేదా వ్యక్తిగత కారణాల వల్ల అయితే మరో దఫాలో సర్వేలో భాగస్వాములు అవుతారా అనే విషయమై చర్చ సాగుతోంది.
కాగా, పవన్ కళ్యాణ్ సమగ్ర సర్వేలో పాల్గొనక పోవడంపై కేసీఆర్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ సర్వేలో పాల్గొనలేదని ఓ విలేకరి ప్రస్తావించినప్పుడు... పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉండదలుచుకోలేదేమోనని, కేవలం టూరిస్టుగానే తెలంగాణలో ఉండదలుచుకున్నాడేమోనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సమగ్ర సర్వేలో వివరాలు ఇవ్వకపోతే అది వారి కర్మ అన్నారు. ప్రభుత్వ సర్వేలో పాల్గొనక పోవడం సామాజిక నేరమని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications