జగనన్న కాలనీలో పవన్ కళ్యాణ్: జనసందోహంలో ఒక్క ఛాన్స్ అంటూ జనసేనాని
విజయనగరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజధాని పేరిట ఉత్తరాంధ్ర ప్రజలను వైయస్సార్సీపీ నేతలు మోసం చేస్తున్నారన్నారు. విజయనగరం జిల్లా గుంకలాంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీని పవన్ కళ్యాణ్ ఆదివారం పరిశీలించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
జనసేనకు ఒక్క అవకాశమివ్వాలన్న పవన్ కళ్యాణ్
వైయస్సార్సీపీ ప్రభుత్వ మోసాన్ని ప్రజలు గ్రహించాలన్నారు పవన్. ఉత్తరాంధ్ర ప్రజలకు బలమైన రాజకీయ అధికారం దక్కాలన్నారు. జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే.. మార్పు అంటే ఏంటో చూపిస్తామన్నారు పవన్ కళ్యాణ్. యువత తన శక్తిని అవినీతి నిర్మూలనకు వినియోగించాలన్నారు.
నమ్మకం ఉంచాలంటూ యువతకు పవన్ కళ్యాణ్ పిలుపు
మీ భవిష్యత్ కోసం నన్ను నమ్మండి. నాపై నమ్మకం ఉంచితే గూండాలతో పోరాడేందుకు నేన సిద్ధమంటూ పవన్ కళ్యాణ్ యువతకు పిలుపునిచ్చారు. మత్స్యకారులు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. మత్స్యకారులకు హాని కలిగించే దేనినైనా జనసేన అడ్డుకుంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. మత్స్యకారులు ఉపాధి కోసం గోవా, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఇక్కడే జెట్టీలు నిర్మించి వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు.
అవినీతి రహిత ప్రభుత్వం తీసుకొద్దామన్న పవన్
అవినీతిపై రాజీలేని పోరాటం చేద్దామన్నారు పవన్ కళ్యాణ్. అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొద్దామన్నారు. ఉత్తరాంధ్ర జనసైనికులు ధైర్యంగా పోరాడాలన్నారు. బలంగా ఎదుర్కొవాలని.. కేసులు పెడితే మీతోపాటు తాను వస్తానన్నారు. అవినీతి గోడలు బద్దలు కొడదామని ప్రజలకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
ఇళ్ల నిర్మాణంలో 12 కోట్ల అవినీతి అంటూ పవన్
ఇళ్ల నిర్మాణం పేరుతో 12వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు పవన్ కళ్యాణ్. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామన్నారు. కనీసం రోడ్లు కూడా వెయ్యలేదని మండిపడ్డారు. బొత్స జేబులోంచి ప్రజలకు సొమ్ము ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. రోడ్లు వేయలేని వైసీపీ ప్రభుత్వం.. రాజధాని కడతారా? అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్కు ఘనస్వాగతం
మరోవైపు, విజయనగరం జిల్లాలోని గుంకలాంలో పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం లభించింది. దారిపొడవునా పూలవర్షం కురిపించారు అభిమానులు. గుంకలాంలో పవన్ పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున జనసేన అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. అందరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ ముందుకు వెళ్లారు.