మెత్తటివాడ్నే! తేడా వస్తే తోలుతీస్తా: తట్టుకోలేరంటూ జగన్కు పవన్ తీవ్ర హెచ్చరిక
తూర్పుగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలకు దిగడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video
గూండాలు, ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తామని, అలాంటి పోరాటమే కావాలనుకుంటే సిద్ధమని హెచ్చరించారు. బుధవారం భీమవరం సమీపంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మీరు తట్టుకోలేరు..
విలువలతో కూడిన రాజకీయం చేయడానికి వచ్చాననీ, ఎలాంటి భాష ఉపయోగించాలో తెలిసినవాడిననీ పవన్ చెప్పారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడటం మొదలుపెడితే ఫ్యాక్షనిస్టు నాయకులు ఊహించలేరని, తట్టుకోలేరని, పారిపోతారని ఘాటుగా సమాధానమిచ్చారు. అయితే, అలాంటి మాటలతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు.
తేడా వస్తే తోలు తీస్తా..
‘ఇసుక మాఫియా, కుంభకోణాలు, దోపిడీలు చేసే వీళ్ల(జగన్, చంద్రబాబు)కే పిచ్చిపిచ్చిగా మాట్లాడే తెగింపు ఉంటే.. ప్రజా సంక్షేమం కోసం నిలబడే నాకు ఎంత తెగింపు ఉండాలి. చూడ్డానికి పవన్ కళ్యాణ్ మెత్తగా కనిపిస్తాడు.. కానీ తేడా వస్తే తోలు తీస్తాడు' అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
ఆ భయంతోనే తిడుతున్నారు..
‘సమాజంలో మార్పు తీసుకొస్తున్నామనే భయంతోనే టీడీపీ, బీజేపీ, వైసీపీ అందరూ నన్ను తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఒంటిస్తంభం మేడ మీద కూర్చొనే వ్యక్తి కాదు. నేల మీద నడిచే వ్యక్తి అని గుర్తుంచుకోవాలి' అని పవన్ వ్యాఖ్యానించారు.
వేల కోట్లు, గూండాలు అవసరం లేదు
‘రాజకీయాల్లో మానవత్వం చచ్చిపోయింది. మరిచిపోయిన మానవత్వం, జవాబుదారితనాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడానికే జనసేన పార్టీ పెట్టా.. రాజకీయాలకు వేల కోట్లు, గూండాలు అవసరం లేదు. ఆశయం కోసం చిత్తశుద్ధి, సదాశయాలు, మానత్వం ఉండాలి' అని పవన్ తెలిపారు.
ప్రేమాభిమానాలతో విధ్వంసం వద్దు
‘సినిమా నాకు ఇంతమంది ప్రేమాభిమానాలు ఇచ్చిదంటే ఏదో కారణం ఉందని అనిపించింది. ఆ కారణం.. సమాజానికి తిరిగి పని చేయడమే అని తెలుసుకున్నా. జన సైనికులకు తనను కలుసుకోవాలని ఉంటుంది. కానీ, కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవు. అలాంటప్పుడు తనపై ఉన్న అభిమానం, ప్రేమతో విధ్వంసం సృష్టించకుండా జాగ్రత్తగా ఉండాలి. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నేనే ఈ స్థాయికి వస్తే.. బాగా చదువుకున్న మీరు ఏ స్థాయికి వెళ్లగలరో ఊహించుకోవాలి' అని పార్టీ శ్రేణులు, అభిమానులతో పవన్ అన్నారు.
ఐదేళ్లు కష్టడపితే ముఖ్యమంత్రి పదవి..
‘రాజకీయాలకు బలమైన క్రమశిక్షణ, ఓపిక కావాలి. ప్రతి జన సైనికుడు వాటిని అలవర్చుకోవాలి. ఒక తరంలో మార్పు రావాలంటే 25ఏళ్లు పడుతుంది. అందుకే నేను 25ఏళ్లు రాజకీయాలు చేయడానికి వచ్చానని తరచూ చెబుతున్న. 5ఏళ్లు గట్టిగా కష్టపడితే ముఖ్యమంత్రి, మంత్రి సీటులో కూర్చోవచ్చు కానీ దాని వల్ల సమాజంలో మార్పు రాదు. ఒక సామాజిక మార్పు తెచ్చేందుకు మరింత ప్రణాళికతో ముందుకు వెళ్లాలి' అని పవన్ వ్యాఖ్యానించారు.