ఓసారి అలా, మరోసారి ఇలా: బాబుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం, మోడీపై విమర్శలు
హైదరాబాద్: విభజన జరిగి నాలుగేళ్లయినా కేంద్రం ఇచ్చిన చాలా హామీలు అలాగే ఉన్నాయని, అందుకే దిశానిర్దేశనం చేయమని తాను లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ వద్దకు వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం చెప్పారు.
జేపీతో మాట్లాడిన అనంతరం పవన్ విలేకరులతో మాట్లాడారు. జేపీ అంటే తనకు ఎంతో గౌరవం అని, తాను అభిమానించే వారిలో ఆయన ఒకరు అని చెప్పారు. విభజన సమయంలో జేపీ ఎంతో అధ్యయనం చేశారని చెప్పారు. విభజన హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి
తాము విభజన సమస్యలపై చర్చించామని పవన్ అన్నారు. విభజన సమయంలో పోరాటం చేసిన మేథావులు ఉన్నారని, అందరితో కలిసి మాట్లాడుతామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన చాలా హమీలు అలాగే ఉన్నాయన్నారు.

ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రాలు
ప్రత్యేక పరిస్థితుల్లో ఏపీ, తెలంగాణ ఏర్పడ్డాయని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై పవన్ విమర్శలు గుప్పించారు. ప్యాకేజీ అద్భుతమని ఓసారి అంటారని, మళ్లీ బాగా లేదని అంటారని ఎద్దేవా చేశారు. టీడీపీని నమ్మలేని పరిస్థితులు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. విభజన హామీలు నెరవేర్చే దిశలో అన్ని పార్టీలు ముందుకు రావాలన్నారు.

విభజన సమస్యల పరిష్కారం కోసమే జేఏసీ
కేంద్రంపై ఎఫెక్టివ్గా ఒత్తిడి తీసుకు రావాలని చెప్పారు. విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ జేఏసీ పని చేస్తుందని చెప్పారు. అందరితో కూర్చొని మాట్లాడుతామన్నారు. ఒక్క చర్చతో ఏ సమస్యకు పరిష్కారం దొరకదని చెప్పారు. విభజన తర్వాత ఇప్పటిదాకా ఏపీకి అయితే న్యాయం జరగలేదన్నారు.

బీజేపీకి గంటా వార్నింగ్
కాగా, బీజేపీపై మంత్రి గంటా శ్రీనివాస రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీపై బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే వీలైతే బీజేపీతో పొత్తు వదులుకుంటామని చెప్పారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పారు. బీజేపీ మిత్రధర్మం పాటించడం లేదన్నారు.












Click it and Unblock the Notifications