చూస్తూ ఊరుకోం- తొక్కి నార తీస్తా- వైసీపీకి పవన్ హెచ్చరికలు..!
ఏపీలో విపక్ష వైసీపీ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై ఫైర్ అయ్యారు. ఏలూరు జిల్లా ఐ.ఎస్.జగన్నాథపురంలో దీపం-2 పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీని పవన్ ప్రారంభించారు. అక్కడే జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
వైసీపీ చేసిన తప్పుడు విధానాలు, దోపిడీ వల్ల ఇబ్బందులు కొనసాగుతున్నాయని పవన్ ఆరోపించారు. చింత చచ్చినా పులుపు చావడం లేదన్నట్లు, ఇంత దారుణంగా ఓడినా వారి నోరు ఆగట్లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నోటి వెంట మరేమీ రాకుండా మీ భవిష్యత్ ను చేస్తానని హెచ్చరించారు. తాను త్రికరణ శుద్ధితో పనిచేస్తానని, ఆఫీసులో కూర్చుని ఇష్టానికి మాట్లాడితే మీ సంగతి చూస్తానంటూ వైసీపీ నేతలకు జనసేనాని హెచ్చరికలు జారీ చేసారు. తొక్కి నార తీస్తా, చూస్తూ ఉండబోమన్నారు.

మహిళలపై అశ్లీలత, వేధింపులు, సమస్యలపై పవన్ సీరియస్ అయ్యారు. సంక్షేమ హాస్టల్స్ లో బాత్ రూమ్ లు సక్రమంగా లేవు, వసతులు లేవని, ఆడ బిడ్డలకు సమస్యలు వస్తె చర్యలు కఠినంగా ఉంటాయని పవన్ హెచ్చరించారు. డీప్ ఫేక్ ఫోటో లు, టెక్నాలజీ తో సోషల్ మీడియాలో వేధిస్తే సహించబోమన్నారు. డిజిటల్ ప్రైవసీ యాక్ట్ రాకముందే ఆ చట్టం ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. వైసీపీ సోషల్ మీడియా ప్రతీ ఫ్లాట్ ఫాం మానిటరింగ్ చేస్తున్నామని పవన్ తెలిపారు.
వైసీపీ నేతల చర్యలపై బలమైన యాక్షన్ తీసుకుంటామని, తర్వాత రోడ్లపైకి వస్తె కాళ్ళు, కీళ్ళు ఇరక్కొడతామని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు టాంపరింగ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 151 నుండి 11 సీట్లు వస్తే, డ్రామా లు, పాటలు మొదలుపెట్టారని ఆక్షేపించారు. దేశంలో శాంతి భద్రతల విషయంలో ప్రధాని మోడీ హెచ్చరించారని, దేశ భద్రతకు భంగం కల్పించేలా, మత విద్వేషాలు, కుల గొడవలు చేయాలని ఎవరైనా చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.












Click it and Unblock the Notifications