పవన్ కల్యాణ్ ఈసారికూడా అడుగు పెట్టకూడదు!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. రాజోలు నుంచి గెలుపొందిన రాపాక వరప్రసాద్ వైసీపీలోకి ఫిరాయించారు. రానున్న ఎన్నికల్లో రాజోలు నుంచి వైసీపీ తరఫున బరిలోకి దిగడానికి రాపాక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే జనసేనాని వచ్చే ఎన్నికల కోసం ఎక్కడి నుంచి పోటీచేయనున్నారనే ఉత్కంఠ నెలకొంది.

పిఠాపురం నుంచి పోటీచేస్తే..
గాజువాక, భీమవరం నుంచే ఈసారి కూడా పోటీచేస్తారంటూ వార్తలు వస్తున్నప్పటికీ వాటిపై స్పష్టత రాలేదు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి పోటీచేయాలంటూ అక్కడి నాయకత్వం నుంచి పవన్ కు ఆహ్వానం అందించింది. ఈ నియోజకవర్గంలో 80 శాతం ఓటర్లు కాపు సామాజికవర్గానికి చెందినవారే ఉన్నారు. ఇక్కడినుంచి పోటీచేస్తే గెలిపించుకుంటామంటూ స్థానిక నాయకులు బహిరంగంగానే ప్రకటించారు.

పవన్ అడుగు పెట్టకూడదు
ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఈసారి కూడా పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టకూడదనే పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీచేయడం ఖాయమైతే అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎంపీ వంగా గీతను బరిలోకి దింపాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఇక్కడ దొరబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంపీగా ఉన్న గీత అసెంబ్లీకి పోటీచేయాలనే ఆసక్తిని ప్రదర్శిస్తోంది. దీంతో పిఠాపురం నుంచి బరిలోకి దింపే అవకాశం ఉందంటున్నారు.

ముద్రగడ అంగీకరిస్తే..
అంతేకాకుండా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను వైసీపీకిలోకి ఆహ్వానిస్తున్నారు. ఒకవేళ ముద్రగడ అంగీకరిస్తే రాజ్యసభ సీటు ఇవ్వాలనుకుంటున్నారు. లేదంటే పిఠాపురం నుంచి బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగడం ఖాయం కానప్పటికీ అధికార పార్టీ మాత్రం పిఠాపురం కేంద్రంగానే రాజకీయ వ్యూహరచన చేస్తోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని పార్టీల యంత్రాంగం సిద్ధమవుతున్న తరుణంలో పవన్ కల్యాణ్ ను, జనసేన పార్టీని నిరోధించడానికి వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది.












Click it and Unblock the Notifications