హార్వర్డ్ బృందం రాక: నెల చివరలో చంద్రబాబుతో పవన్ భేటీ
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జులై 31న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఉద్దానంలోని కిడ్నీ బాధితుల సమస్యలపై, వారి కోసం ఆ ప్రాంతంలో చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారని సమాచారం. పవన్ ఇప్పటికే హార్వర్డ్ మెడికల్ స్కూల్కి చెందిన వైద్యులతో ఈ అంశంపై చర్చించారు.
పవన్ కొద్ది నెలల కిందట హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉపన్యసించేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సందర్బంగా అక్కడి మెడికల్ స్కూల్ వైద్యులతో మాట్లాడారు. ఉద్దానంలోని కిడ్నీ బాధితులు పెరగడం, వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై వారితో చర్చించారు.

ఈ నేపథ్యంలో స్కూల్ రీజినల్ విభాగం ముఖ్య వైద్యుడు జోసెఫ్ బెన్వంత్రీ నేతృత్వంలోని బృందం ఉద్దానంలో పర్యటించనుంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమం కూడా ఇప్పటికే ఖరారు చేశారు. జులై 29న జోసెఫ్ బృందం ఉద్దానంలో పర్యటించి ప్రాథమికంగా వివరాలను సేకరిస్తుంది. అక్కడి ప్రజలను కలిసి సమస్యపై అడిగి తెలుసుకుంటారు.
హార్వర్డ్ వైద్యులు ఉద్దానంలో సమస్యకు మూలాలు తెలుసుకోవడంతోపాటు అక్కడ కిడ్నీ వ్యాధులకు సంబంధించిన పరిశోధన, వైద్యకేంద్రాలు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. కాగా, జులై 30న విశాఖపట్నంలో హార్వర్డ్ వైద్యులతో పవన్ సమావేశమై చర్చిస్తారు. ఆ తర్వాత పవన్, వైద్యులు... చంద్రబాబుతో భేటీ అవుతారు. ఉద్దానంలో తక్షణం చేపట్టాల్సిన చర్యల గురించి ఈ సందర్భంగా చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications