పార్టీ ఎందుకు పెట్టానంటే.. పవన్ మరో ట్విస్ట్, 'పుస్తకం'తో 'ఫైట్': బీజేపీకి కౌంటర్?
అమరావతి: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో పుస్తకం రాయనున్నారు. తొలి పుస్తకం 'ఇజం'కు భిన్నంగా 'నేను-మనం-జనం' అనే పుస్తకాన్ని తీసుకు వస్తున్నారు. ఇందులో జనసేన సిద్ధంతాలు ఉండనున్నాయి. జనసేన సిద్ధంతాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో పవన్ దీనిని ఎంచుకున్నారు.
'నేను-మనం-జనం' పుస్తకానికి మార్పు కోసం యుద్ధం అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. పవన్ ఏది చెప్పినా అందరినీ ఆశ్చర్యపరిచేవిగా ఉంటాయి. 2014 ఎన్నికలకు ముందు ఆయన పార్టీ పెట్టడం ఓ సంచలనం. పోటీ చేస్తాడనుకున్న సమయంలో హఠాత్తుగా బిజెపి-టిడిపి కూటమికి మద్దతు పలికి మరో ట్విస్ట్ ఇచ్చారు.
ఆ కూటమి తరఫున జోరుగా ప్రచారం నిర్వహించారు. తాను మద్దతిచ్చిన ప్రభుత్వాలు ఏమైనా తప్పు చేస్తే తాను ప్రశ్నిస్తానని ఎన్నికల ప్రచార సమయంలోనే పవన్ చెప్పారు. అన్నట్లుగానే పలు అంశాలపై సందర్భం వచ్చినప్పుడు స్పందించారు.
పవన్ అప్పుడప్పుడు వచ్చి వెళ్లడం కాదని, గెస్ట్ రోల్ కాకుండా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలని పలువురు విమర్శలు గుప్పించారు. అనూహ్యంగా పదిహేను రోజుల క్రితం తిరుపతిలో సభ పెట్టారు. అంతేకాదు, ఏ పార్టీకైతే మద్దతిచ్చారో అదే బీజేపీని ప్రత్యేక హోదా పైన నిలదీశారు.
పవన్కు మోడీతో మంచి సంబంధాలు ఉండటం, బీజేపీకి మద్దతు పలికిన నేపథ్యంలో ఆయన బీజేపీ పైన విమర్శలు చేస్తారా అనే అనుమానాన్ని పటాపంచలు చేస్తూ తిరుపతిలో కమలం పార్టీని నిలదీశారు. అంతేకాదు, హోదా పైన పూర్తి స్పష్టత వచ్చాక తాను మళ్లీ మాట్లాడుతానని చెప్పారు.
పవన్ తిరుపతి సభ అనంతరం, కేంద్రంలో కదలిక వచ్చింది. హోదాతో సమానమైన ప్యాకేజీ అంటూ చెప్పింది. హోదా పైన కేంద్రం తేల్చి చెప్పడంతో కాకినాడ సభలో.. ఏ బీజేపీకైతే మద్దతిచ్చారో అదే పార్టీని చీల్చి చెండాడారు.
అప్పటిదాకా విపక్షాలు అతని వెనుక బీజేపీ ఉందని, టీడీపీ ఉందని ఆరోపించాయి. తన విమర్శల ద్వారా వారి వాదన తప్పని నిరూపించారు.
కాకినాడ సభలో మాట్లాడుతూ.. హోదా విషయంలో రాష్ట్రానికి చెందిన నాయకులు విఫలమైతే తాను రంగంలోకి దిగుతానని ప్రకటించారు. హోదా పైన ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ఇచ్చినట్లుగా కనిపించినప్పటికీ ప్రశ్నించడాన్ని మాత్రం ఆపడం లేదు.
ఈ నేపథ్యంలో హఠాత్తుగా నేను-మనం-నిజం పేరుతో పుస్తకం తీసుకు వస్తానని చెప్పడం, దానికి మార్పుకోసం యుద్ధం అని ట్యాగ్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఇది ఓ రకంగా పార్టీ పెట్టడం వెనుక ఆయనకు ఉన్న ఉద్దేశ్యాన్ని, ప్రేరేపించిన పరిస్థితులను, చెయ్యాలనుకున్న కార్యక్రమాలను, సాధించాలనుకున్న ఆశయాలను ప్రతిబింబించేవిగా ఉంటాయని చెబుతున్నారు.
ఈ పుస్తకంలో జనసేన సిద్ధాంతాలు చెప్పడంతో పాటు.. రాజకీయ పార్టీలు ఎలా ఉండాలనే విషయాన్ని కూడా సూటిగా చెప్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ప్రత్యేక హోదా ప్రభావం నేపథ్యంలో.. ఇచ్చిన మాట తప్పక పోవడం, హామీ ఇస్తే దానిని నెరవేర్చడం, అసాధ్యమయ్యే హామీలు ఇవ్వకపోవడం మంచిదనే అంశాలను పవన్ కళ్యాణ్ తన పుస్తకంలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా పొందుపర్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అంతేకాదు, ఈ పుస్తకం ఉద్దేశ్యం 2019 కూడా టార్గెట్ కావొచ్చంటున్నారు.