ఇంత డ్యామేజ్ చేస్తావా?, ధైర్యముంటే ఒక్క ఆధారం బయటపెట్టు: పవన్కు బాబు సవాల్
అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, టీడీపీపై వస్తున్న విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. మంగళవారం ఉదయం సుదీర్ఘ టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. బీజేపీకి కోవర్టుగా మారి టీడీపీ మీద బురద జల్లడమే పవన్ కల్యాణ్ పని అని విమర్శించారు.

తీవ్రంగా పరిగణిస్తున్నా:
ఎప్పుడూ తనపై ఏదో ఒక విమర్శ చేసే జగన్ ను తాను పట్టించుకోబోనని, కానీ మిత్రుడిలా పవన్ తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు వాపోయారు. మోడీతో విభేదాల కారణంగానే నాకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్న పవన్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా పరిగణిస్తున్నానని అన్నారు.

పవన్ ఆరోపణలను తిప్పికొట్టండి:
ఏళ్ల క్రితం జరిగిన గోద్రా ఘటనలపై అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలను మోడీ ఇంకా గుర్తుంచుకుంటారని తాను భావించడం లేదని చంద్రబాబు అన్నారు. ఆ విమర్శలు అప్పటికే పరిమితమని, ఆ లాజిక్ ఇప్పుడు పనిచేయదని చెప్పారు. అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలను గుర్తుంచుకునే మోడీ తనను దూరం పెడుతున్నారనేలా పవన్ వ్యవహరిస్తున్నట్టు పరోక్షంగా ఆయన చెప్పారు. టీడీపీ నాయకులంతా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తిప్పికొట్టాలని ఆదేశించారు.

ఇంత డ్యామేజ్ చేస్తావా?:
లోకేష్ అవినీతిపై తాను ఆరోపణలు చేయడం కాదు, ప్రధాని మోడీ వద్ద కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయన్న పవన్ కామెంట్స్ ను టెలికాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు చంద్రబాబు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేసి ఎవరికి మేలు చేయాలని పవన్ భావిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. టీడీపీపై, తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేసి పవన్ ఇంత డ్యామేజ్ చేస్తాడనుకోలేదని వాపోయారు.

ఇద్దరూ.. కోవర్టులే:
పవన్ కల్యాణ్, జగన్ ఇద్దరూ బీజేపీకి కోవర్టులుగా పనిచేస్తున్నారని చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో ఎంపీలతో అన్నారు. పదేపదే ఓ అబద్దాన్ని ప్రచారం చేసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారన్నారు. పవన్ విమర్శలను బీజేపీ ఎంపీ హరిబాబు మెచ్చుకోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. పవన్ వంటి వ్యక్తి ఒక విమర్శ చేసేముందు నిజానిజాలను తెలుసుకోవాలని సూచించారు.

ధైర్యముంటే బయటపెట్టు..:
పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందంటున్న పవన్ కల్యాణ్.. ధైర్యముంటే ఒక్క ఆధారాన్ని బయట పెట్టాలని సవాల్ విసిరారు చంద్రబాబు. ఇప్పటిదాకా రాష్ట్రంలో ప్రాజెక్టులను వైసీపీ అడ్డుకుంటే.. ఇప్పుడు జనసేన కూడా దానికి తోడైందన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలన్న పవన్ వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. బీజేపీ నేతలే వెనుక ఉండి పవన్ కల్యాణ్ ను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులోనూ అవినీతి లేదని, తాను అవినీతిని సహించే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.

పోలవరంపై పవన్ అవాస్తవాలు..:
పోలవరం నిర్వాసితులకు పునరావాసం ఇస్తామని కేంద్రం చెప్పినట్లు.. దాన్ని తోసిరాజని రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు బాధ్యతలను తీసుకున్నట్టు పవన్ వ్యాఖ్యానించడం అవాస్తవమని అన్నారు. జగన్ మీడియాలో గతంలో ప్రసారమైన అవాస్తవాలనే పవన్ చెబుతున్నారని మండిపడ్డారు.
మోడీపై వైసీపీ, జనసేన ఈగ కూడా వాలనివ్వడం లేదని ఆరోపించారు. టీడీపీపై బద్నాం చేయడానికే రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కుట్రలను ఎదుర్కోవడంలో తెలుగు ప్రజలు రాటుదేలిపోయారని అన్నారు.












Click it and Unblock the Notifications