నాగబాబుకు హడావిడిగా మంత్రి పదవి -పవన్ అసలు ప్లాన్ అదేనా ?
ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ ఎంపీ సీట్లను టీడీపీ, బీజేపీ పంచేసుకోవడంతో జనసేనకు రిక్తహస్తం ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబును సంతృప్తి పర్చేందుకు ఆయన్ను త్వరలో కేబినెట్ లోకి తీసుకోబోతున్నట్లు సీఎం చంద్రబాబు అనూహ్య ప్రకటన చేశారు. అయితే దీని వెనుక భారీ కసరత్తే జరిగిందని అర్థమవుతోంది. తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలోనే ఈ ప్లాన్ ఖరారైనట్లు తెలుస్తోంది.
ఏపీ కేబినెట్లో ఆరునెలలుగా ఓ బెర్తు ఖాళీగా ఉంది. కూటమి సమీకరణాల నేపథ్యంలో దాన్ని వీలు చూసుకుని భర్తీ చేద్దామని చంద్రబాబు భావించారు. అయితే తిరుపతి లడ్డూ వివాదం తర్వాత జాతీయ స్దాయిలో పవన్ కళ్యాణ్ హవా పెరిగింది. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పవన్ ను పిలిచి ప్రచారం చేయించేందుకు బీజేపీ తహతహలాడుతోంది. దీంతో పవన్ కూడా అంతే స్పీడుగా స్పందిస్తున్నారు. ఏపీలో ఎలాగో ఇప్పట్లో ఎన్నికలు లేవు. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి ఆయన సై అంటున్నారు.

అదే సమయంలో పవన్ ఛరిష్మాను పూర్తి స్ధాయిలో వాడుకోవాలని భావిస్తున్న కాషాయ దళం ఆయన్ని రాబోయే ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లోనూ వాడుకునేందుకు సిద్దమవుతోంది. ఇలా వరుస ఎన్నికల్లో వాడుకుంటూ పవన్ కు తిరిగి ఏదీ ఇవ్వకపోయినా ఇబ్బందే. దీంతో ఎలాగో తమ గూట్లో ఉన్న పవన్ ను ఎంపీని చేసి కేంద్రమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ ఉత్సాహంగా ఉంది. ఈ మేరకు ఇప్పటికే ఆయనకు సంకేతాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ పెద్దల సూచన మేరకే పవన్ కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని బావించి కూడా చివరికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
ఇప్పుడు అవకాశం రావడంతో కేంద్రంలోకి వెళ్లేందుకు పవన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అజెండాలోని అంశాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్న పవన్ పై ఆ పార్టీలో సైతం సానుకూలత వ్యక్తమవుతోంది. బీజేపీకి నమ్మకమైన మిత్రుడిగా మారిన పవన్ తో భవిష్యత్తులో బీజేపీకి చాలా అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రమంత్రిగా రావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తన స్ధానంలో కేబినెట్లోకి అన్న నాగబాబును పవన్ పంపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications