ప్రభాస్ ఫ్యాన్స్తో గొడవ, గుంటూరులోనూ: స్పందించిన పవన్ కళ్యాణ్!
హైదరాబాద్: భీమవరంలో అభిమానుల మధ్య గొడవ విషయమై జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించినట్లుగా తెలుస్తోంది. తాను భౌతిక దాడులకు వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.
వర్గవైషమ్యాలు, కులమత వివాదాలు వద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తన అభిమానులలో కక్ష సాధింపు, ప్రతీకార చర్యలు ఉండటాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారని తెలుస్తోంది.

ఆయన ఈ విషయమై తూర్పు గోదావరి జిల్లా కాపునాడు అధ్యక్షులు, అభిమాన సంఘం నేతలతో ఫోన్లో మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సూచించారు.
అభిమానం ఆగ్రహావేశాలకు దారి తీసిన విషయం తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని ప్రభాస్ అభఇమాన సంఘం నాయకులు ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అయితే, ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తుల ధ్వంసం వరకు ఇది వెళ్లిందని ఆవేదనన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆయన అభిమానులు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో రెండో తేది సాయంత్రం పవన్ ఫ్లెక్సీని రెండో పట్టణ ప్రాంతంలో ప్రభాస్ అభిమాని చించివేసినట్లు తెలుసుకున్న పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెల్లవారుజామున మూడు గంటల వరకు రెండో పట్టణ ప్రాంతాల్లో నిరసన తెలిపారు. కొంతమంది భౌతిక దాడులకు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఇది సామాజికవర్గాల తగాదాగా మారిపోయిందని అంటున్నారు. పోలీసులు పదిమంది పైన కేసులు పెట్టి అదుపులోకి తీసుకున్నారు.
భీమవరంలో మొదలైన పవన్, ప్రభాస్ అభిమానుల ఘర్షణలు గుంటూరు, ఏలూరు నగరాలకు విస్తరించాయి. శనివారం రాత్రి గుంటూరులోని కొన్ని ప్రాంతాల్లో ఒక హీరో అభిమానుల ప్లెక్సీలను మరో హీరో అభిమానులు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ... కొందరు రోడ్లపై నిరసనలు తెలిపారు.












Click it and Unblock the Notifications