సాక్షితో ఎన్డీటివి బంధం, సర్వేల్లో తిరకాసు: పయ్యావుల
ఆ చానల్, జగన్ మీడియాకు మధ్య వ్యాపార ఒప్పందాలు ఉన్నాయన్నది అందరికీ తెలిసిందేనని, ఈ పరిస్థితిల్లో ఆ సర్వేలను కాకి లెక్కలుగానే పరిగణించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. రెండు సంస్థలకు మధ్య ఉన్న సంబంధాలు చెప్పకుండా జగన్కు అనుకూలంగా ఫలితాలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని ఆ పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు.
తెలంగాణలో బిజెపికి 15% ఓట్లు, టిడిపికి 8% ఓట్లు వస్తాయని విడివిడిగా లెక్కించి, సీమాంధ్రలో ఇద్దరికి కలిపి 37% ఓట్లు వస్తాయని ఎన్డీటివి చెప్పిందని, ఒకవైపు బిజెపితో కలిపి, మరోవైపు విడిగా లెక్కించడం దేనికి నిదర్శనమన్నారు. అందులోని శాస్త్రీయత ఏమిటని, ఆ విధంగా లెక్కించమని జగన్ వారికేమైనా చెప్పారా అని, అందుకోసం ఎన్డీటివి ఎంత తీసుకుందన్నారు.
జగన్, సాక్షిలతో ఉన్న సంబంధం చెప్పకుండా, తీసుకున్న సొమ్ములు చెప్పకుండా.. సర్వేలో జగన్కు అనుకూల వాతావరణం ఉందని చెప్పి ఎన్డీటివి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. జూన్ 2011లో జగన్ పైన సిబిఐ కేసు పెట్టగానే... ఎన్డీటివితో సాక్షి మూడేళ్లకు అంగీకారానికి వచ్చి, రూ.30 కోట్లు ఇవ్వడానికి సాక్షి ఒప్పందం కుదుర్చుకుందన్నారు.
ఆ రోజు నుండి సాక్షి కార్యాలయాలు ఎన్డీటివి పర్యవేక్షణలోనే ఉన్నాయని, ఇది అందరికీ తెలిసిందే అన్నారు. ఇలాంటి తెరచాటు ఒప్పందాలను కుదుర్చుకొని, వ్యాపార రహస్యాలని దాచి, దొంగ సర్వేలతో ప్రజలను మభ్యపెట్టాలని చూడటమేమిటన్నారు. ఇటీవలే సి ఓటరు సర్వే సంస్థ డబ్బులు తీసుకొని ఎలా కావాలంటే అలా సర్వేలిచ్చిన సంగతి బయటపడిందని, అదే సంస్థ జగన్కు సర్వేలు చేసి పెట్టిందన్నారు. తెలుగులో కూడా ఒకటి రెండు ఛానళ్లు విశ్వసనీయత లేని సర్వేలు ప్రకటిస్తున్నాయని ఆరోపంచారు.