జగన్ పదవులతో పీఏసీలో ఖాళీలు-భర్తీకి స్పీకర్ కు లేఖ రాసిన ఛైర్మన్ పయ్యావుల..
ఏపీ ప్రజాపద్దుల సంఘంలో ఐదుగురు సభ్యులకు సీఎం వైఎస్ జగన్ మంత్రులు, విప్ పదవులను కట్టబెట్టారు.
అమరావతి : ఏపీ అసెంబ్లీ కమిటీల్లో ఒకటైన ప్రజాపద్దుల కమిటీలో మొత్తం 12 మంది సభ్యులు ఉండాలి. ఇందులో 10 మంది సభ్యుల్ని గతంలో భర్తీ చేశారు. ఛైర్మన్ గా విపక్ష టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (payyavula keshav ) కు అవకాశం దక్కింది. వరుసగా రెండోసారి పీఏసీ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పయ్యావులకు తాజాగా ఓ సమస్య వచ్చి పడింది.
పీఏసీలో ఇప్పటికే ఇద్దరు సభ్యుల్ని భర్తీ చేయాల్సి ఉంది. అదే సమయంలో ఉన్న 10 మందిలోనూ ఐదుగురు వివిధ పదవులు వచ్చి వెళ్లిపోయారు. దీంతో కేవలం ఐదుగురు సభ్యులతో పీఏసీని నడిపించాల్సి వస్తోంది. దీనిపై ఇవాళ స్పీకర్ తమ్మినేని సీతారాంకు (tammineni sitaram) పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. పీఏసీలో సభ్యులుగా ఉన్న మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఉషశ్రీ చరణ్ కు మంత్రి పదవులు, కోలగట్ల వీరభద్ర స్వామికి డిప్యూటీ స్పీకర్ పదవి, కరణం ధర్మశ్రీకి విప్ పదవులు ఇచ్చారు. దీంతో ఈ ఐదు స్ధానాలు ఖాళీగా ఉన్నాయి. దీని వల్ల పీఏసీ పనితీరు కుంటుపడుతోందని స్పీకర్ కు రాసిన లేఖలో పయ్యావుల తెలిపారు.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ కోటాలో ఐదు స్ధానాల్ని, మండలి కోటాలో రెండు స్దానాల్ని భర్తీ చేయాలంటూ పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఇవాళ స్పీకర్ తమ్మినేనికి రాసిన లేఖలో కోరారు. ఇదే అంశంపై గతేడాది అక్టోబర్ 21న అసెంబ్లీ కార్యదర్శికి కూడా లేఖ రాశానని, కానీ ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని పయ్యావుల గుర్తుచేశారు. కాబట్టి ఇప్పటికైనా సదరు ఖాళీల్ని భర్తీ చేసి పీఏసీ సక్రమంగా పనిచేసేందుకు సహకరించాలని స్పీకర్ తమ్మినేనిని పయ్యావుల కోరారు. అయితే వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ సర్కార్.. పీఏసీ పూర్తిస్ధాయిలో పనిచేసి తమ లోపాల్ని బయటపెడితే ఇబ్బందులు తప్పవన్న భావనలో ఉన్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications