చంద్రబాబు ప్రకటన తర్వాతే భూములు కొన్నా-బినామీ చట్టం పెట్టుకోండి-పయ్యావుల సవాల్
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారం ఇవాళ మరోసారి ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా రాజధాని ప్రకటనకు ముందే అమరావతిలో భూములు కొన్నారని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన ఆరోపణలపై టీడీపీ మండిపడింది. అలాగే అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కుమారుడు కూడా భూములు కొన్నారంటూ బుగ్గన చేసిన విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అమరావతిలో చంద్రబాబు ప్రకటన తర్వాతే, సాక్షి పత్రికలో గ్రామాల వివరాలు కూడా వచ్చాకే తాను భూములు కొనుగోలు చేశానని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆర్ధికమంత్రికి దమ్ముంటే తాను భూములు కొనుగోలు చేసిన తేదీని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అమరావతిలో ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో విచారణలు చేయించుకుందని, అయినా ఇన్ సైడర్ ట్రేడింగ్ ను నిరూపించలేకపోయిందన్నారు. ప్రభుత్వానికి కనీసం సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాల్ చేసే ధైర్యం కూడా లేదన్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం బినామీ చట్టం ప్రకారం అమరావతి భూముల క్రయవిక్రయాలపై కేసులు పెట్టుకోవచ్చన్నారు.
వైసీపీ సర్కార్ కు ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే అమరావతి రాజధాని భూములపై విచారణ చేయించినట్లే.. ఈ మూడేళ్లలో విశాఖలో భూముల క్రయవిక్రయాలపై విచారణ చేయించాలన్నారు. రాజధాని ప్రకటనకు ముందే తాను భూముల్ని కొని ఉంటే వాటిని ప్రభుత్వానికి గిఫ్ట్ గా ఇచ్చేస్తానన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తాను కొనుగోలు చేసిన తేదీకీ, ప్రకటనకు మధ్య వ్యత్యాసం గమనించాలన్నారు. ప్రభుత్వం వద్ద వివరాలు ఉంటాయి కదా అని అడిగారు. కానీ దీనిపై స్పందించిన బుగ్గన... టీడీపీ దఫదఫాలుగా ఈ భూములు కొనుగోలు చేసిందన్నారు.