AP Budget 2025: ఏపీకి ఇక అప్పు పుట్టదా ? బడ్జెట్ లో తేల్చేసిన ఆర్థికమంత్రి..!
ఏపీ అసెంబ్లీలో ఇవాళ 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.. తన ప్రసంగంలో ఓ కీలక విషయం చెప్పేశారు. రాష్ట్రంలో గతంలో రెండు ప్రభుత్వాల్లోనూ అప్పులపై తీవ్ర చర్చ జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక తాజా పరిస్ధితిపై పయ్యావుల కేశవ్ క్లారిటీ ఇచ్చారు. నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఆర్థికమంత్రి పయ్యావుల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆర్థిక విధ్వంసకర పరిస్థితుల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఎంతో క్లిష్టతరమని పయ్యావుల ఇవాళ తన ప్రసంగంలో తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రతీ శాఖలోనూ ఆర్థిక అరాచకం చేసిందన్నారు. ఆయా శాఖల్లో లెక్కలను కొలిక్కి తీసుకొచ్చేందుకు చాలా సమయమే పట్టిందన్నారు. గత ప్రభుత్వ అరాచకాలను స్వయంగా నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించిందన్నారు. ఏపీ రుణ సామర్థ్యాన్ని సున్నాకు తీసుకువచ్చారని.. రాష్ట్రానికి అప్పు తీసుకునే పరిస్థితి లేదని నీతి ఆయోగ్ తెలిపిందన్నారు.

తద్వారా దేశం మొత్తంలో అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని ఆర్థికమంత్రి తేల్చిచెప్పేశారు. ఈ పరిస్థితిల్లో బడ్జెట్ విషయంలో సీఎం చంద్రబాబు మాటలే తమకు మార్గదర్శకంగా నిలిచాయంటూ ఆర్ధికమంత్రి చెప్పుకొచ్చారు. అణుదాడిలో విధ్వసమైన హిరోషిమా నగరం లేచి నిలబడగా లేనిది ఆర్థిక విధ్వంసం జరిగిన ఏపీని తిరిగి నిలబెట్టలేమా అన్న సీఎం మాటల స్ఫూర్తితో ఈ బడ్జెట్ రూపొందించినట్లు పయ్యావుల చెప్పుకొచ్చారు. అయితే అప్పుల విషయంలో పయ్యావుల చేసిన వ్యాఖ్యలతో ఇక రాష్ట్రం అప్పు తీసుకునే పరిస్ధితి లేదని మాత్రం తేలిపోయింది.












Click it and Unblock the Notifications