కేంద్ర మంత్రులను ఊరేగిస్తాం: పయ్యావుల, అదే: గాలి
హైదరాబాద్: రాజీనామాలు చేస్తే వస్తే సీమాంధ్ర కేంద్ర మంత్రులను ఊరేగిస్తామని రాయలసీమకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ అన్నారు. విభజనకు వ్యతిరేకంగా అందరం కలిసి పనిచేద్దామని ఏ పార్టీ నాయకులు కూడా తమను కోరలేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. బిల్లును అధ్యయనం చేస్తే తెలంగాణ నాయకులు కూడా విభజనను అంగీకరించరని ఆయన అన్నారు. విభజన బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు ఘర్షణ జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే 21 మంది సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులు యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం ఒక్కటే మార్గమని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మాయమాటలతో ప్రజలను వంచించడం ఇకనైనా మానుకుని తక్షణమే ఆ పనిచేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజన జరుగుతుందని తెలిసి కూడా పదవులను కాపాడుకోవడానికి తెలియనట్లు నటిస్తూ కాంగ్రెసు నేతలు ప్రజలను మోసగించారని ఆయన విమర్శించారు. రాష్ట్రం విభజన ముసాయిదా బిల్లు మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు నాటకాలాడుతున్నారని గాలిముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. విభజన విషయం కాంగ్రెస్ నేతలకు ముందే తెలుసన్నారు. సీమాంధ్రుల కోరికలను కాంగ్రెస్ పట్టించుకోలేదని ఆరోపించారు.
ఏ వాదం గెలుస్తుందో ఎన్నికల్లో తేలుతుందని గాలి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండు ప్రకటనలు చేసి సమైక్యవాదినని ముద్ర వేయించుకున్నారని విమర్శించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మెప్పు కోసం ఏపీఎన్జీవోల సమ్మెను కిరణ్ కుమార్ రెడ్డి విరమింపజేశారని గాలి ముద్దుకృష్ణమ విమర్శించారు.












Click it and Unblock the Notifications