చివరి బంతి ఏమిటి: సిఎంను ప్రశ్నించిన పయ్యావుల
హైదరాబాద్/ సంగారెడ్డి: రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి ఇంకా చివరి బంతి మిగిలి ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. తన వద్ద ఉన్న చివరి బంతి ఏమిటో చెప్పాలని ఆయన ముఖ్యమంత్రిని అడిగారు. ఎవరు బౌలింగ్ చేస్తారు, ఎవరు ఫీల్డింగ్ చేస్తారో కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాలని ఆయన అడిగారు.
రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు ప్రతి పేజీలో తప్పులున్నాయని ఆయన గురువారం మీడియాతో అన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లు గల్లంతయ్యాయని, ఇటువంటి తప్పులు బిల్లులో కోకొల్లలుగా ఉన్నాయని ఆయన అన్నారు. బిల్లు తప్పులమయంగా ఉందని రాష్ట్రపతికి వివరిస్తామని ఆయన చెప్పారు. ప్రజల పక్షాన నిలిచి అంతిమ విజయం సాధించేది తమ పార్టీయేనని ఆయన అన్నారు.
కాగా, శాసనమండలిలో ముఖ్యమంత్రి విభజన విషయంపై ప్రసంగించిన తీరును తెలంగాణ ఎమ్మెల్సీలు తప్పు పట్టారు. ఇతర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ను ముడిపెట్టవద్దని కాంగ్రెసు ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. మిగతా రాష్ట్రాల విభజన తీరుపై ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఆయన తప్పు పట్టారు.
ఆయా విభజనల్లో రాష్ట్రాలు కోరితేనే రాష్ట్రపతి ద్వారా విభజన జరిగిందని, కానీ తెలంగాణ విషయంలో పరిస్థితి వేరని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసును సీమాంధ్ర జెఎసి కార్యాలయంగా మార్చారని ఆయన విమర్సించారు. ఇరు ప్రాంతాలవారిని కూడా అయోమయానికి గురి చేసే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.