జీవితంలో సీఎం కాలేరు: పయ్యావుల, జగన్ ఏం చెప్తే అది చేస్తాం: ఉమ
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన జీవిత కాలంలో కూడా ముఖ్యమంత్రి కాలేరని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ శుక్రవారం నాడు అన్నారు. జగన్ ఏపీ అభివృద్ధికి అడుగడుగునా అడ్డం పడుతున్నారన్నారు.
జగన్కు పరిపాలన చేత కాదనే 2014లో ప్రజలు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పి ఓడించారని దుయ్యబట్టారు. వైసిపి నుంచి టిడిపిలోకి వెళ్లిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలన్న జగన్ పైన పయ్యావుల తీవ్రంగా స్పందించారు.
ఎన్నికల పేరుతో అడుగడుగునా ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పట్టిసీమను, ప్రజల రాజధాని అమరావతిని, భోగాపురం విమానాశ్రయం, ఉపాధి కల్పించే బందర్ పోర్టు ససేమిరా కుదరదంటూ అడ్డుతగులుతున్నారన్నారు.
చివరకు పనిచేసే ప్రభుత్వాన్ని కూలుస్తానంటున్నారన్నారు. కులాలు, ప్రాంతాల పేరుతో రాష్ట్రాన్ని నిప్పుల కుంపటి చేస్తానంటున్నారన్నారు. ఆయనేదో హస్త సాముద్రికను నమ్ముకుంటూ తానే ముఖ్యమంత్రిని అవుతానని పిచ్చి భ్రమలో ఉన్నారన్నారు. 2019లో కాదు కదా.. జీవితంలోనే సీఎం కాలేడన్నారు.

ఎప్పటికీ తెలుగు ప్రజల గుండెచప్పుడుగా టిడిపి ఉంటుందన్నారు. వాటిన్నికంటే ముందు ప్రతిపక్ష నేతగా నిన్ను నీవు నిరూపించుకోవాలని, ప్రజా క్షేత్రంలో నీ బలమేంటో తేల్చుకోవాలన్నారు. నీపై, నీ ఎమ్మెల్యేలపై, ప్రజలపై నమ్మకం ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలన్నారు. దమ్ముంటే మీ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలన్నారు. ప్రజలు నీవైపు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఇదో మంచి అవకాశమన్నారు.
విశాఖ రైల్వే జోన్పై రఘువీరా
కేంద్రం హామీ ఇచ్చిన విధంగా విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అనంతపురంలో విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కనీసం ప్రస్తావించను కూడా ప్రస్తావించలేదన్నారు.
ఇది పూర్తిగా చంద్రబాబు వైఫల్యమన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైల్వే బడ్జెట్లో అన్యాయం జరిగితే, ఆయన వెళ్లి పోరాడి మరిన్ని ప్రాజెక్టులు, రైళ్లు తీసుకు వచ్చారన్నారు. తక్షణం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖకు జోన్ మంజూరు చేయించాలని, కొత్త రైల్వే లైన్లు సాధించుకు రావాలన్నారు.
వైసిపి ఏం చెప్తే అది చేస్తాం: బొండ ఉమ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమ సవాల్ చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న జగన్ తొలుత తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని, ఉప ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. జగన్ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగి ఉప ఎన్నికల్లో గెలిస్తే అప్పుడు వైసిపి ఏం చెబితే అది చేసేందుకు సిద్ధమని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేయలేదని, ఇప్పుడు రైల్వే అభివృద్ధిపై మాట్లాడటం విడ్డూరమన్నారు.












Click it and Unblock the Notifications