కుప్పంలో చంద్రబాబు డిసైడ్ అయ్యారు - ఈ మూడేళ్ల దెబ్బకే ఇలా : పెద్దిరెడ్డి..!!
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు మూడు రోజుల పర్యటనలో భాగంగా చోటు చేసుకున్న పరిణామాలు..చంద్రబాబు చేసిన ఆరోపణలపైనా పెద్దిరెడ్డి స్పందించారు. చంద్రబాబు చూసుకుందాం రండి అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటాన్ని మంత్రి తప్పు బట్టారు. ముఖ్యమంత్రి జగన్ ను కిమ్ తో పోల్చుతూ చంద్రబాబు వ్యాఖ్యానించటం పైన స్పందించిన మంత్రి.. దేశ రాజకీయాల్లో వెన్నుపోటు దారుడంటే చంద్రబాబు అని చెబుతారని దుయ్యబట్టారు.

ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం
సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 30 ఏళ్లు క్యాబినెట్ హోదాలో ఉండి అనేక పదవులు అనుభవించి కుప్పంలో పలానా పనిచేశానని కుప్పం ప్రజలకు చెప్పుకునే పరిస్థితి లేక అడ్డగోలు మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఈ మూడేళ్ల కాలంలో వచ్చిన ప్రతీ సందర్భంలోనూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసారని ఆరోపించారు. కొల్లుపల్లె అనే గ్రామంలో వైయస్ఆర్ సీపీ కార్యకర్త భయ్యారెడ్డి పైన దాడి చేసిన వీడియోను ప్రదర్శించారు.

వైసీపీ శ్రేణులపైనే దాడులు
వైసీపీ కార్యకర్తలపైన దాడి చేసి.. నిందలు వేసి.. తమ పార్టీ పైనే ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు వ్యవహరించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదని ఎద్దేవా చేసారు. చంద్రబాబు కుప్పంలో వరుసగా ఎదురైన అపజయాలను చూసి.. పరిస్థితులన్నీ గమనించి.. కుప్పంలో గెలవలేనని అభిప్రాయానికి వచ్చాడు. అందుకే శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఆలోచనతో కుట్రలుచేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా 33 ఏళ్ల కంటే ఈ మూడేళ్లలోనే ఎక్కువ సార్లు వచ్చారని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయలేని ఎమ్మెల్యే చంద్రబాబని మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు.

గెలుపు సాధ్యం కాదని తెలిసే..
కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తిచేసే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేసారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండగా ఇవి చేశాను.. మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పనులు చేస్తానని ఎవరైనా చెబుతారు. కానీ, చంద్రబాబు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పర్యటన సమయంలో వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని.. టీడీపీ కార్యకర్తల్లో ఎవరికైనా చిన్న గాయమైనా అయిందా అని ప్రశ్నించారు. అటు సీఎం జగన్ కుప్పంలో ఈ సారి ఎలాగైనా గెలవాలంటూ పార్టీ నేతలకు నిర్దేశిస్తుంటే..ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సారి పులివెందులలోనూ గెలుపు టీడీపీదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు కుప్పం ఫైట్ రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications