దేశంలోనే అతిపెద్ద మద్యం స్కాం..! ఇదే సాక్ష్యం- పెద్దిరెడ్డి ఫైర్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద మద్యం స్కాంకు తెర తీసిందని వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ రాజమండ్రిలో ఆరోపించారు. సెంట్రల్ జైల్లో ఉన్న తన కుమారుడు మిథున్ రెడ్డిని వైసీపీ నేతలతో కలిసి పరామర్శించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత టీడీపీ హయాంలో భారీ లిక్కర్ స్కాం జరిగిందని, ఇవాళ కూటమి సర్కార్ లోనూ దానికి మించి మద్యం అవినీతి జరుగుతోందని పెద్దిరెడ్డి ఆరోపించారు.
ఈ ఏడాది కాలంలోనే చంద్రబాబు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కాంకు తెరతీసిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చి, నిత్యం అవినీతి సొమ్ముతో జేబులు నింపుకోవడంలోనే చంద్రబాబు నిమగ్నమయ్యారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్ఆర్సీపీ శ్రేణులపై తప్పుడు కేసులతో జైళ్ళకు పంపాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాడని విమర్శించారు.

కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చేస్తున్నది దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కాం అని పెద్ది రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసేసి, ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిందని, ఏపీలో వైసీపీ హయంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలను తీసేసి, ప్రభుత్వమే వాటిని నిర్వహించిందని గుర్తుచేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం వైయస్ జగన్ ఏ డిస్టిలరీలకు కొత్తగా అనుమతులు ఇవ్వలేదన్నారు.
కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు.. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లిక్కర్ దుకాణాలను తీసేసి, ప్రైవేటు వారికి అప్పగించారని, అలాగే మద్యం రేట్లు ఎమ్మార్పీని ఉల్లంఘంచి అధిక రేట్లకు విక్రయిస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. మద్యం డోర్ డెలివరీ అవుతుందని, ప్రతి గ్రామం, వార్డుల్లో మద్యం బెల్ట్ షాప్లు నడుస్తున్నాయని గుర్తుచేశారు. దీనికి తోడు కల్తీ మద్యాన్ని కూడా విచ్చలవిడిగా తయారు చేసి విక్రయిస్తున్నారన్నారు. ఇంత చేసినా ఆదాయం మాత్రం పెరగడం లేదంటే అర్థం ఏమిటని ప్రశ్నించారు.

2014-19 చంద్రబాబు పాలనలో ఆఖరి సంవత్సరంలో వచ్చిన ఏడాది మద్యం ఆదాయం కేవలం రూ.17వేల కోట్లు మాత్రమేనని, తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ హయాంలో ఆఖరి ఏడాది వచ్చిన మద్యం ఆదాయం రూ.25 వేల కోట్లు అన్నారు. పైగా మద్యం విక్రయాలు కూడా గణనీయంగా తగ్గాయన్నారు. ఇంతగా మద్యంను నియంత్రించేందుకు వైసీపీ ప్రభుత్వం పనిచేసిందన్నారు. తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్ళీ మద్యంను అడ్డం పెట్టుకుని తన అవినీతి దాహంను తీర్చుకునే ప్రయత్నం ప్రారంభించాడన్నారు. ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు.












Click it and Unblock the Notifications