రైతుల్లేకుంటే మనం లేము: హైకోర్టు ఆగ్రహం, టీ సర్వేపై..
ఈ పిటిషన్ పైన హైకోర్టు మండిపడింది. రైతు లేకపోతే మనం కూడా లేమని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. అప్పులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొంది. అన్నం పెట్టే రైతన్నకు రుణమాఫీ చేస్తే తప్పేమిటని ప్రశ్నించింది. దుస్తులిచ్చే నేతన్నలకు, ఇల్లు కట్టే మేస్త్రీలకు సహకరిస్తే తప్పు కాదని అభిప్రాయపడింది. ప్రభుత్వం నిర్ణయం సరైనదా కాదా అనే విషయంపై తాము చర్చించలేదని, సమగ్ర వివరాలతో మరోమారు పిటిషన్ వేయాలన్నారు.
హైకోర్టు వ్యాఖ్యలను పత్తిపాటి పుల్లారావు విజయవాడలో చెప్పారు. రుణమాఫీ చేస్తే తప్పులేదని హైకోర్టు కూడా చెప్పిందన్నారు.
పాలిథీన్ కవర్ల నిషేధం పైన రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
పాలిథీన్ కవర్ల పైన ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పాలిథీన్ కవర్ల వాడకం పైన హైకోర్టు సీరియస్ అయింది. మూడు వారాల్లో సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించింది.
సమగ్ర సర్వేపై నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర సర్వే పైన హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రయివేటు వ్యక్తులతో సమగ్ర సర్వే వివరాలు నమోదు చేయిస్తున్నారన్న పిటిషన్ పైన హైకోర్టు విచారణ చేపట్టింది.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 19వ తేదీన సమగ్ర సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో అందరు తమ తమ వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. సమగ్ర సర్వే కోసం ఇతర రాష్ట్రాల నుండి కూడా తెలంగాణ ప్రజలు తరలి వచ్చారు.
హైకోర్టులో పిటిషన్
హైదరాబాదు పాతబస్తీ ప్రాంతంలోని సిఖ్ చావనీలో జరిగిన కాల్పుల ఘటన పైన హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని ఫిర్యాదుగా స్వీకరించాలని కోర్టు ఆదేశించింది.
10 నిమిషాల్లో చేరుకుంటాం: మహేందర్ రెడ్డి
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఆయుధ ప్రదర్శనకు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ఈ ఏడాది 653 మంది పోలీసులు చనిపోయారని తెలిపారు. ఫోన్ చేసిన పది నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకునే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలీసుల కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు.