జగన్ ప్రజల్ని నమ్మించి గొంతు కోశారు : జనసేన అధినేత పవన్కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతిలో పర్యటించారు .జగన్ ఏపీలో మూడు రాజధానులు పెడతామని ఎన్నికల్లో గెలవకముందే చెప్పాల్సిందని ఆయన పేర్కొన్నారు. రాజధాని ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు . జగన్ ను నమ్మి ప్రజలు అవకాశం ఇస్తే ఇప్పుడు ప్రజల్ని నమ్మించి గొంతు కోశారని జనసేన అధినేత పవన్కళ్యాణ్ ధ్వజమెత్తారు.

2014లోనే రాజధాని నిర్ణయం జరిగిందన్న పవన్
రాజధాని ప్రాంత రైతులు ఇక్కడ పంటలు పండే భూములను టీడీపీ కోసం ఇవ్వలేదని, ప్రభుత్వానికి ఇచ్చారని తెలిపారు. టీడీపీ మీద కక్షతో రాజధాని రైతులను ఇలా రోడ్డు మీదకు వచ్చేలా చెయ్యటం కరెక్ట్ కాదన్నారు. ఇక యూపీఏ తీసుకొచ్చిన ఆధార్ని ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తోందని, ఎన్డీయే సర్కార్ రాగానే దానిని తీసెయ్యలేదని అలాగే అమరావతిని కూడా ఈ ప్రభుత్వం కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయం కానీ.. ఆ నిర్ణయం 2014లోనే జరిగిపోయిందని రాజధాని అమరావతినేనని పవన్ పేర్కొన్నారు .

రాజధానిని శ్రీకాకుళంలో పెట్టి ఉంటే అభివృద్ధి జరిగేదన్న జనసేనాని
వైసీపీ వస్తే అమరావతిని కొనసాగిస్తారని నమ్మి ఓట్లు వేస్తే.. ఇప్పుడు విశాఖ అంటూ ప్రజల్ని అయోమయానికి గురిచేశారని మండిపడ్డారు .రాజధానిని శ్రీకాకుళంలో పెట్టి ఉంటే అభివృద్ధి జరిగేది కానీ ఎంతో అభివృద్ధి చెందిన విశాఖలో ఎందుకు పెడుతున్నారని పవన్ ప్రశ్నించారు. ఇక అమరావతి కోసం బీజేపీ కలిసి రాకుంటే , వైసీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ నుండి బయటకు రావటానికి కూడా తాను సిద్ధం అని పవన్ పేర్కొనారు.

రాజధాని ఇక్కడే ఉండేలా చూస్తానన్న పవన్ కళ్యాణ్
ఇక తాను రోడ్డుపైకి వస్తే ఆందోళనలు చేస్తే రాజధాని తరలింపు ఆగుతుందంటే చేస్తా.. మాటిస్తే ఆగుతుంది అంటే మాట ఇస్తా. నా చేతిలో లేనప్పుడు ఎలా మాట ఇవ్వగలను? అంటూ మాట్లాడారు పవన్ . కానీ రాజధాని ఇక్కడే ఉండేలా చూస్తానని తన ప్రయత్నం తాను చేస్తానని హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు . రాష్ట్రంలో అనిశ్చితి చూసి వరల్డ్ బ్యాంక్ వెనక్కి వెళ్లిపోయిందని ఆయన తెలిపారు . వైసీపీకి 151 మెజార్టీ ఇస్తే ప్రజల్లో అస్థిరత ఏర్పడేలా చేశారు . రాష్ట్రంలో అనిశ్చితి సృష్టించారని మండిపడ్డారు .












Click it and Unblock the Notifications