చంద్రబాబు 'పర్సనాలిటీ డెవలప్ మెంట్'!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికలను ఎదుర్కోవడానికి పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించినప్పటి నుంచి ఆయన ఎంతో హుషారుగా కనపడుతున్నారు. ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలకరించడమే కాదు.. అవకాశం దొరికినప్పుడల్లా వైసీపీపై, ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ప్రజల్లో మార్పు వచ్చిందని, రానున్న ఎన్నికల్లో తనను, తన పార్టీని గెలిపించబోతున్నారనే దృఢ విశ్వాసంతో బాబు ఉన్నారు. అందుకే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భయపడేది లేదని, ఎదుర్కోవడానికి తాము సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు. ఎన్నికలు రేపు జరిగినా, ఎల్లుండి జరిగినా తాము గెలుస్తామనే ధీమాను ఆయన వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని మీడియా సమావేశంలో నేరుగా చెబుతున్నారు. 175 స్థానాల్లో వైసీపీని ఓడించేందుకే ప్రయత్నిస్తామంటున్నారు.

ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేయడమే వైసీపీ అజెండాగా మారిందని, కానీ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలెవరూ అధికార పార్టీకి భయపడరని స్పష్టం చేస్తున్నారు. ముందస్తుగా వచ్చినా సరే.. షెడ్యూల్ ప్రకారమే వచ్చినా సరే ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో టీడీపీకి కొరుకుడు పడని నియోజకవర్గాల జాబితాను సిద్ధం చేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గెలుపొందని నియోజకవర్గాల జాబితాను ప్రత్యేకంగా తయారుచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోను వైసీపీని ఓడించి తీరుతామంటున్న చంద్రబాబు పార్టీకి కొరుకుడు పడని నియోజకవర్గాల్లో గెలుపొందడానికి కూడా ఇదే మంచి తరుణమని భావిస్తున్నారు. జాబితా తయారైన తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు పర్సనాలిటీ డెవలప్ మెంట్ ట్రైనర్ లా చంద్రబాబు కృషిచేస్తూనే ఉంటారని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications