డిక్లరేషన్ లేకుండా జగన్ తిరుమల దర్శనంపై హైకోర్టులో పిటిషన్- మంత్రులు, టీటీడీ పెద్దలపైనా-
ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. డిక్లరేషన్ పై వివాదం చెలరేగినా, విపక్షాలు రాద్దాంతం చేసినా అవేవీ పట్టించుకోకుండా దర్శనం పూర్తి చేసుకున్న జగన్పై ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే దర్శనం పూర్తయినా ఈ వ్యవహారంలో సీఎం జగన్తో పాటు అధికారులు వ్యవహరించిన తీరుపై ఈ పిటిషన్ దాఖలైంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 23న తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వతహాగా క్రిస్టియన్ అయిన జగన్ తిరుమలలో సంప్రదాయంగా వస్తున్న డిక్లరేషన్ను ఇవ్వకుండానే అన్ని అధికారిక లాంఛనాలతో ఆయన దర్శనం కూడా పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ సింఘాల్తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇలా సీఎం జగన్ అన్యమతస్తుడై ఉండి డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా దర్శనం చేసుకోవడం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

గుంటూరు జిల్లా వైకుంఠాపురానికి చెందిన సుధాకర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల దర్శనానికి వెళ్లిన జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడం దేవాదాయచట్టంలోని 97, 153 సెక్షన్లకు విరుద్ధమని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. డిక్లరేషన్ ఉల్లంఘించిన జగన్తో పాటు ఆయనతో పాటు ఉండి ఈ కార్యక్రమానికి సహకరించిన మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, వైవీ సుబ్బారెడ్డి, అనిల్ సింఘాల్ ఏ విధంగా అధికారంలో కొనసాగుతారంటూ పిటిషనర్ ప్రశ్నించారు. నిబంధనలను ఉల్లంఘించిన వీరంతా ఎలా పదవుల్లో కొనసాగుతున్నారో హైకోర్టు వివరణ కోరాలని పిటిషనర్ కోరారు.












Click it and Unblock the Notifications