ఫైలిన్: శ్రీకాకుళంలో 52వేల మంది తరలింపు
శ్రీకాకుళం: తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన ఫైలిన్ పెను తుపాను.. తీర ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆందోలనలకు గురిచేస్తోంది. తుపాను ప్రభావం పట్ల అప్రమత్తమైన ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని సుమారు 52వేల మందిని తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ఖాళీ చేయించారు. 25వేల మంది ప్రజలకు పునరావాస కేంద్రాల్లోకి తరలించారు.
నావికా, తీర రక్షక దళాలే కాకుండా ఐదు బృందాలుగా ఏర్పడిన జాతీయ విపత్తు సహాయ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. నావికా దళాలు, తీర ప్రాంత రక్షక దళాలు అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఓ సీనియర్ అధికారి చెప్పారు. సీమాంధ్ర ఉద్యమం కారణంగా స్థానికంగా ఉన్న బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ సిబ్బందిని కూడా తుపాను ప్రభావిత ప్రాంతాలకు తరలించనున్నట్లు తెలిపారు.
తుపాను ప్రభావిత ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతం, ఒడిశా రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో సుమారు 100 నుంచి 160 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విజయనగరంలో జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 15వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని 25గ్రామాలు తుపాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫైలిన్ తుపానుపై శనివారం సమీక్ష జరిపారు. శ్రీకాకుళం, విజయనగరం విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మొదలగు తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సిఎం కిరణ్ తెలిపారు. అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆయన తెలిపారు.