Pic Talk: ముగ్గురు మిత్రులు కేసీఆర్, వైఎస్ జగన్, స్టాలిన్: ఒకేరోజు..మూడు ఘన విజయాలు
అమరావతి: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఎవరు రాజు..ఎవరు బంటు అనేది తేల్చి పారేసింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలకు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి ఒకింత చేదు అనుభవాన్నే మిగిల్చాయి.
కేరళలో ఒకట్రెండు సీట్లు వచ్చినా గొప్పే అనిపించేలా ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి గట్టి పోటీ ఇవ్వగలిగిందే తప్ప అధికార పీఠం నుంచి కదిలించలేకపోయింది. అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకుంది.
డీఎంకే ధాటికి..
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి మినహాయిస్తే.. దక్షిణాదిన ఉన్నరెండు పెద్ద రాష్ట్రాలు తమిళనాడు, కేరళల్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనే బీజేపీ ఆశలు నీరుగారాయి. తమిళనాడులో ఏఐఎడీఎంకే-బీజేపీ కూటమి అధికారాన్ని కోల్పోయింది. ప్రతిపక్ష డీఎంకే భారీ మెజారిటీని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా పగ్గాలను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దేశ రాజకీయాలను శాసించిన ఇద్దరు రాజకీయ దురంధరులు కరుణానిధి, జయలలిత లేని ఎన్నికలను తమిళనాడు అసెంబ్లీ ఎదుర్కొంది. ఆ ఇద్దరు నేతల వారసులుగా ఎడప్పాడి పళనిస్వామి, ఎంకే స్టాలిన్ ఈ ఎన్నికల్లో తలపడ్డారు. విజయం స్టాలిన్ను వరించింది.
తిరుపతిలో వైసీపీ.. సాగర్లో టీఆర్ఎస్
మరోవంక- రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ హవా బలంగా వీచింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఎం గురుమూర్తి భారీ ఆధిక్యంతో కొనసాగుతున్నారు. తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మిపై సుమారు మూడు లక్షల వరకు ఆధిక్యతను సాధించారు. ఓట్ల లెక్కింపు చివరిదశకు రావడంతో ఆయన గెలుపు ఖాయమైనట్టే. రెండున్నర నుంచి మూడు లక్షల మెజారిటీతో గురుమూర్తి గెలుపొందుతారనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి రాకపోయినప్పటికీ.. విజయం ఏకపక్షమైంది.
సాగర్లో గులాబీ జెండా..
తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితం వెలువడింది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీమంత్రి కుందూరు జానారెడ్డిపై గెలిచారు. నోముల భగత్ 18 వేల పైచిలుకు మెజారిటీ లభించింది. టీఆర్ఎస్కే చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. నోముల భగత్ ప్రతి రౌండ్లోనూ మంచి ఆధిక్యాన్ని ప్రదర్శించారు. తొలి తొమ్మిది రౌండ్లలో నోముల భగత్ ఆధిక్యం ప్రదర్శించారు. బీజేపీ తరఫున పోటీ చేసిన రవి నాయక్కు నామమాత్రపు ఓట్లు పోల్ అయ్యాయి.
Recommended Video
ముచ్చటగా ముగ్గురికీ మూడు విజయాలు
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్లతో పాటు వారి మిత్రుడు, తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్.. మరపురాని విజయాలను అందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అది కూడా ఒకేరోజు కావడం ఆసక్తికరంగా మారింది. తిరుపతిలో వైసీపీ, నాగార్జున సాగర్లో టీఆర్ఎస్, తమిళనాడులో డీఎంకే తమ ప్రత్యర్థులపై తిరుగులేని విజయాన్ని నమోదు చేశాయి. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ ఆడిటోరియంలో నిర్వహించిన వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి అటు కేసీఆర్, ఇటు స్టాలిన్ హాజరయ్యారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆ ముగ్గురికీ ఒకేరోజు ఘన విజయాలు దక్కడం ఆసక్తి రేపుతోంది.