జగన్పై బాబు నిప్పులు, పవన్కు కితాబు (పిక్చర్స్)
శ్రీకాకుళం/విజయనగరం: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బహిరంగ సభను తొలుత విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని భావించారని కానీ, విశాఖ లోకసభ స్థానం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పోటీ చేస్తున్నారని, అందుకే అక్కడ సభను రద్దు చేశారని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దానిని గుంటూరులో నిర్వహించారన్నారు.
తల్లి, పిల్ల కాంగ్రెస్ కుమ్మక్కుకు ఇదే నిదర్శనమన్నారు. జగన్కు ఓటేస్తే రాహుల్ను ప్రధాన మంత్రిని చేయడానికి చూస్తారని, ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీలూ కలిసిపోతాయన్నారు. చంద్రబాబు శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు.
అక్రమాస్తుల కేసుల్లో ప్రధాన నిందితునిగా ఉన్న జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని, టిడిపి అధికారంలోకి రాగానే జగన్ అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. 2004లో ఆయన ఆస్తి ఎంతో? ఈ పదేళ్లలో లక్ష కోట్లు ఎలా వచ్చాయో జగన్ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు
పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం లూటీ అయ్యిందని, వైయస్ ద్వారా డబ్బు మూటలు అందుకుని అవినీతికి సోనియా లైసెన్సు ఇచ్చారని నిప్పులు చెరిగారు.

చంద్రబాబు
జగన్ పార్టీ కుటుంబ రాజకీయ పార్టీగా మారిందని, ఒంగోలు, కడప, విశాఖల్లో కుటుంబ సభ్యులనే బరిలోకి దింపిందని గుర్తు చేశారు. ఆ పార్టీ దొంగలు, రౌడీలు, జైలు పక్షుల పార్టీ అని అభివర్ణించారు.

చంద్రబాబు
తనతో పాటు చదువుకున్న వాళ్లంతా ఐఏఎస్లు, ఐపీఎస్లుగా స్థిరపడితే.. జగన్ సహచరులంతా జైలుకు వెళుతున్నారని, తనపై ఆరోపణలు చేయడం జగన్ తండ్రి వైయస్ వల్లనే కాలేదని, జగన్ ఆరోపణల్లో నిజం ఎంతో ప్రజలకే తెలుస్తుందన్నారు.

చంద్రబాబు
ఇక్కడ జగన్తో, అక్కడ కెసిఆర్తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగమే రాష్ట్ర విభజన అని చంద్రబాబు ధ్వజమెత్తారు. అందుకే వాళ్లిద్దరూ ఒకరినొకరు విమర్శించుకోరని చెప్పారు.

చంద్రబాబు
వాళ్ల మధ్య రాజకీయ బంధమే కాదని, ఆర్థిక బంధాలు కూడా ఉన్నాయన్నారు. హైదరాబాద్లోని తన అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి జగన్ కెసిఆర్తో లోపాయికారీ మైత్రీ బంధాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు
రైతుల రుణమాఫీ సాధ్యమేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. తాను రుణమాఫీ చేస్తానంటే జగన్కు ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. తాను పని రాక్షసుడినని, పట్టుకుంటే ఉడుంపట్టేనని తేల్చి చెప్పారు. మంచి సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదన్నారు.

చంద్రబాబు
సీమాంధ్రను మరో సింగపూర్లా మార్చేంత వరకూ విశ్రమించనని చెప్పారు. రాష్ట్రాన్ని విడగొట్టే అధికారం ఎవరిచ్చారు మీకు? ఎవడబ్బ సొత్తని ఏకపక్షంగా విభజించారు? ఎంపీలపై దాడులు చేయించి, ప్రసార మాధ్యమాలను బంద్ చేయించి.. విభజించేశామని నాలుగ్గోడల మధ్య ప్రకటించేస్తే సరా..? ఆరోజు పరిణామాలను చూస్తుంటే రక్తం ఉడికిపోయిందని, సోనియా కనిపిస్తే సంగతి తేల్చేసేవాడ్ని అన్నారు.

చంద్రబాబు
మరోసారి తెలుగు జాతి జోలికొస్తే ఖబడ్దార్.. జాగ్రత్త అని సోనియాను హెచ్చరించారు. ఆస్తులను తెలంగాణకు కట్టబెట్టి, అప్పుల మూటను సీమాంధ్రుల నెత్తిన పెట్టి వెళ్లగొడతారా అని నిలదీశారు.

చంద్రబాబు
విభజన బిల్లును యుద్ధ విమానంలో తీసుకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఈ కుళ్లు రాజకీయాలు, కుట్రలు, ఢిల్లీ పెద్దల నియంతృత్వ ధోరణే సీమాంధ్రను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలన్న కసి, పట్టుదలను తనలో పెంచిందన్నారు.

చంద్రబాబు
కొత్త రాజధానిని నిర్మించే సత్తా తనకే ఉందన్నారు. సీమాంధ్రను పూర్తిస్థాయిలో నిర్మించేవరకు నిద్రపోనని భరోసా ఇచ్చారు. సీమాంధ్రలో టిడిపిని గెలిపిస్తే మోడీతో సమన్వయం చేసుకుని సీమాంధ్రను సింగపూర్లా మార్చడం అసాధ్యం కాదన్నారు.

చంద్రబాబు
తాను పెద్ద రాష్ట్రానికే తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేశానని, విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తనకు లేదన్నారు. అయినా, అనాథలా మారిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలన్న కృతనిశ్చయంతోనే పోరాడుతున్నానని చెప్పారు.

చంద్రబాబు
కేంద్రంలోనూ బిజెపి అధికారం చేపడితే అభివృద్ధి త్వరగా జరుగుతుందని, అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో అధికారమిస్తే ఢిల్లీని గజగజలాడించి నిధులను రాబట్టి ఎవరూ ఊహించని రీతిలో కొత్త రాజధానిని నిర్మించి సీమాంధ్రకు అంకితమిస్తానని హామీ ఇచ్చారు.

చంద్రబాబు
పవన్ కళ్యాణ్ స్వార్థంతో రాజకీయాల్లోకి రాలేదని, ఆయనలో దేశభక్తి మెండుగా ఉందని చెప్పారు. అవినీతి నేతలను ఏడాదిలోగా జైలుకు పంపిస్తానని మోడీ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, దేశానికి ఇది శుభ పరిణామమని చెప్పారు.

చంద్రబాబు
అవినీతి ఎక్కడుంటుందో బొత్స అక్కడుంటారని, ఈ ఎన్నికలతో బొత్స కథ సమాప్తమవుతుందని, ఆయన కుటుంబ పాలనకు ఇవే చివరి ఎన్నికలని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications