యాంగ్రీ వుమెన్: రేణుక ఇలా ఊగిపోయారు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: తెలంగాణ ఐకాస కార్యకర్తలు తనను తెలంగాణ ద్రోహి, సీమాంధ్ర తొత్తు అని దూషించడంతో ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో తెలంగాణ ఆందోళనకారులకు, రేణుక మద్దతుదార్లకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారి తీసింది.
ఎపి భవన్ వద్ద శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే గ్రామాలను సీమాంధ్ర ప్రాంతానికి బదిలీ చేయాలన్న కేంద్ర మంత్రివర్గం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భద్రాచలానికి చెందిన విద్యార్థి బృందం ఆంధ్రా భవన్ వద్ద ఆందోళన చేపట్టింది. వారికి మద్దతు తెలియజేసేందుకు రేణుక అక్కడికి వచ్చారు.
ముంపు గ్రామాలు యథాతథంగా భద్రాచలం డివిజన్లోనే ఉండేలా కృషి చేస్తానని ఆందోళనకారులకు ఆమె హామీ ఇచ్చారు. ఆమె మాట్లాడుతుండగా కొందరు సీమాంధ్ర తొత్తు.. తెలంగాణ ద్రోహి గోబ్యాక్.. అంటూ నినాదాలు చేశారు. దీంతో రేణుక అనుచరులు ఆందోళనకారులతో వాగ్వాదానికి దిగారు. రెండు వర్గాల వారు ఒకరినొకరు తోసుకుంటూ బాహాబాహీకి దిగారు.
రేణుక 1
ఢిల్లీలోని ఎపి భవన్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ప్రాంత ఐక్యకార్యాచరణ సమితి నాయకులు ఆందోళన చేస్తున్న దృశ్యం. భద్రాచలం, హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ కావాలని డిమాండ్ చేశారు.
రేణుక 2
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి శనివారం ఊగిపోయారు. ఎపి భవన్లో తెలంగాణవాదులపై మండిపడ్డ ఆమె ఎవరొస్తారో రండి ఖబర్దార్, చూసుకుందాం, భయం తన జాతకంలోనే లేదంటూ తెలంగాణవాదులపై నిప్పులు చెరిగారు.
రేణుక 3
ఆంక్షలులేని తెలంగాణ, భద్రాచలం ముంపు గ్రామాల పరిరక్షణ కోసం శనివారమిక్కడ ఎపి భవన్లో తెలంగాణ విద్యార్థి ఐకాస నిర్వహించిన ధర్నాకు సంఘీభావం తెలపటానికి వచ్చిన ఆమెను టిజెఏసి నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
రేణుక 4
రేణుకా గో బ్యాక్, సీమాంధ్ర తొత్తుల్లారా ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రేణుకా చౌదరి స్వయంగా కారు నడుపుకుంటూ ఎపి భవన్కు చేరుకున్నారు.
రేణుక 5
వచ్చీ రావటంతో భద్రాచలం ఖమ్మందే అంటూ నినదించారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపి, వారితో కలిసి ధర్నాలో కూర్చున్నారు. ఆ సమయంలో టిజెఏసి నేతలు కొందరు అక్కడే ఉన్నారు.
రేణుక 6
ఈ క్రమంలో రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడటం ప్రారంభించారు. ఆమె రెండు మాటలు మాట్లాడగానే ధర్నా స్థలికి కొద్ది దూరంలో గుమిగూడిన జెఏసి నేతలు ఒక్కసారిగా రేణుకకు వ్యతిరేకంగా నినాదాలరు చేశారు.
రేణుక 7
తొలుత వారి నినాదాలను రేణుక పెద్దగా పట్టించుకోలేదు. ధర్నా శిబిరం వద్దకు వారు తరలివచ్చి ఆమెను అడ్డుకోవటానికి ప్రయత్నించటంతోపాటు వ్యక్తిగత విమర్శలకు దిగటంతో రేణుక ఆగ్రహంతో ఊగిపోయారు.
రేణుక 8
ఎవడ్రా నువ్వు.. మాట్లాడొద్దనడానికి అని మండిపడ్డారు. ఇలాంటివి చాలా చూశానని అన్నారు. పలువురు తెలంగాణ నేతలు ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో ఆమె ఊగిపోయారు. చేతులు పైకెత్తి టివాదులకు సవాళ్లు విసిరారు.
రేణుక 9
'నువ్వెవడివి మాట్లాడటానికి. రారా.. చూసుకుందాం.. పోరాపో.. నీదేరా డ్రామా' అంటూ ఊగిపోయారు. ఈ సమయంలో ధర్నా చేస్తున్న విద్యార్థులకు, జెఏసి నాయకులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం సద్దుమణిగింది.
రేణుక 10
భద్రాచలంలో ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపి, భద్రాచలం పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉంచుతామని చెప్పటం సరికాదని, భద్రాచలం రాములవారి ఆస్తులు ముంపు గ్రామాల్లో ఉన్నాయి.
రేణుక 11
అవన్నీ పోతే రామాలయం ఆర్థిక పరిస్థితి ఏమిటి? రామాలయాన్ని, దాని ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమని, గిరిజనులను ఐక్యంగా ఉంచితేనే వారి సంస్కృతి చెడిపోకుండా ఉంటుందని ఆమె ఆ తర్వాత విలేకరుల సమావేశంలో అన్నారు.
రేణుక 12
పార్లమెంటులో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు భద్రాచలం అంశాన్ని ప్రస్తావిస్తామన్నారు. ఆ సమయంలో పలువురు కొందరు రాగా.. నాకేంటి భయం? భయం తన జాతకంలోనే లేదని, భద్రాచలంపై తొలి నుంచీ తాము పోరాడుతున్నామని అన్నారు.