జైరాంపై టిడిపి ఫైర్, కెసిఆర్ను చూసి కాదని.. (పిక్చర్స్)
హైదరాబాద్: కేంద్రమంత్రి, జివోఎం సభ్యులు జైరామ్ రమేష్ పైన తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నేతలు మండిపడుతున్నారు. కేంద్ర మంత్రిగా విభజనలో కీలక పాత్ర పోషించటంతో పాటు తెలుగు జాతిని నాశనం చేసిన జైరాంను ప్రజలు వ్యతిరేకిస్తున్నా సిగ్గు లేకుండా సీమాంధ్రలో పర్యటిస్తున్నాడని టిడిపి నేత కోడెల శివప్రసాద రావు విమర్శించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల నోటిషికేషన్ త్వరలో విడుదల అవుతున్నా ఇంకా సీమాంధ్రలో ప్రజలను మభ్య పెట్టేందుకు పిట్టల దొరలా జైరాం వాగ్ధానాలు చేస్తున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధి వుంటే సీమాంధ్ర అభివృద్ధి పై పార్లమెంట్లో బిల్లు ద్వారా స్పష్టం చేయకుండా ఇప్పుడు వివిధ హామీలు ఇవ్వటం దుర్మార్గంలో భాగమేనన్నారు. ఇలాంటి నేతలు సీమాంధ్రలో తిరగకుండా ప్రజలు అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సోనియాకు దిమ్మదిరిగేలా కెసిఆర్ వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. తెరాస విలీనం అవుతుందని భావించిన సోనియాకి పార్టీని విలీనం చేయమని కెసిఆర్ ప్రకటించటం సోనియాకి చెంప పెట్టులాంటిదన్నారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో రెండున్నర దశబ్దాల వరకు కోలుకొనే పరిస్థితి లేదని, సీమాంధ్ర సంపూర్ణ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమవుతుందన్నారు.
తెలుగుదేశం
విభజనకు కారణమైన జైరాం ఇప్పుడు పగటి వేషగాడిలా సీమాంధ్రలో తిరుగుతున్నారని టిడిపి నేత సోమిరెడ్డి మండిపడ్డారు. జైరాంకు దమ్ముంటే గుంటూరు లేదా నెల్లూరులో పోటీ చేయాలని సోమిరెడ్డి సవాల్ విసిరారు. యూపి విభజన సమయంలో దోచుకున్నట్లు సీమాంధ్రను దోచుకోవాలని చూస్తున్నారని, రామాయణంలో సీతను రావణుడు చెరబట్టినట్లు జైరాం సీమాంధ్ర ప్రజలను చెరపట్టారని ఆయన ఆరోపించారు.
జైరామ్ రమేష్
రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మంత్రి జై రాం రమేష్ పర్యటనకు మంగళవారం గుంటూరులో అడుగడుగునా నిరసనలు వెల్లువెత్తాయి. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, ఐకాసలు వేర్వేరుగా ఆయన పర్యటనను అడ్డుకునేందుకు యత్నించాయి. పరిస్థితి ముందే ఊహించిన పోలీసులు పలువురిని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు.
జైరామ్
కెసిఆర్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారనో, రాబోయే ఎన్నికల కోసమో, మరే ఇతర రాజకీయ ప్రయోజనాన్ని ఆశించో తెలంగాణ ఇవ్వలేదని, అక్కడి ప్రజల సుదీర్ఘకాల ఆకాంక్ష మేరకే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, జిఓఎంసభ్యుడు జైరాం రమేష్ స్పష్టం చేశారు.
రమేష్
మంగళవారం గుంటూరు వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్లో విలేఖర్లతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆర్థిక, సాంస్కృతిక, భావోద్వేగపరమైన చారిత్రక అంశాలు కారణాలుగా ఉన్నాయని జైరాం రమేష్ అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు ఎలాంటి అన్యాయం జరగనీయబోమని, పార్లమెంట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని చెప్పారు.