టీ రాజముద్ర ఇదే: రూపకర్త కదిరేనిగూడెం కుర్రాడు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ రాజముద్రను నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ ఆర్టిస్టు ఏలె లక్ష్మణ్ రూపొందించారు. ఏలె లక్ష్మణ్ నల్లగొండ జిల్లా కదిరేని గూడెం గ్రామానికి చెందినవాడు. కాకతీయుల విజయ తోరణం, మధ్యలో హైదరాబాద్కు ప్రతీక అయిన చార్మినార్, మూడు సింహాల గుర్తు, ఆంగ్లం, తెలుగు, ఉర్దూలో 'తెలంగాణ ప్రభుత్వం' అనే అక్షరాలు, కింద హిందీ భాషలో 'సత్యమేవ జయతే' నినాదం లోగోలో ఉన్నాయి.
పైరు పచ్చల తెలంగాణ కాంక్షకు సంకేతంగా ఆకుపచ్చ రంగును ఉఊంచారు. తెలంగాణ చిహ్నంలో చార్మినార్ ఉండాలంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా కెసిఆర్ను కోరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రూపొందించిన లోగోలో కాకతీయ తోరణం మధ్యలో చార్మినార్ను చేర్చారు. ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం పూర్ణకుంభం. ఇందులోనూ ఆకుపచ్చ రంగు ఎక్కువగా ఉంటుంది. 'ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం' అని తెలుగు, ఇంగ్లీషు, హిందీలో ముద్రించి ఉంటుంది. లోగో కింద 'సత్యమేవ జయతే' అనే నినాదం హిందీలో ఉంటుంది. తెలంగాణ లోగోలో అదనంగా ఉర్దూ భాషకు కూడా చోటు లభించింది.

తెలంగాణ ప్రభుత్వ లోగోను తయారు చేయడం, దీనికి కాబోయే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదముద్ర వేయడం నాకు సంతోషాన్నిచ్చిందని ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే ఓ పత్రికతో అన్నారు. చాలా మంది లోగోలు పంపిస్తున్నారు, నువ్వు కూడా ఒకటి తయారు చేయవచ్చు కదా అని కెసిఆర్ లక్ష్మణ్కు సూచింటార. వారం రోజుల పాటు కష్టపడి గురువారంనాడు లోగోను లక్ష్మణ్ కెసిఆర్కు పంపించారు. కెసిఆర్ సూచించిన మార్పులు చేశారు.

లక్ష్మణ్ పది రకాల డిజైన్లు తయారు చేశారు. చివరికి ఒక్కటి ఎంపికైంది. నల్గొండ జిల్లా ఆత్మకూరు ఎం మండలం కదిరేనిగూడెనికి చెందిన లక్ష్మణ్ ఏలే, హైదరాబాద్లో ఫ్రీలాన్స్ పెయింటర్గా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా లక్ష్మణ్ పలు పోస్టర్లు వేశారు, చిత్రాలు గీశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిత్ర కళాప్రదర్శనలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications