నా సత్తా అది, చేతగాక..: కెసిఆర్పై బాబు (పిక్చర్స్)
హైదరాబాద్: తాను సత్తా చాటి తన రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాను మెరుగు పరిచానని, తెలంగాణలో అటువంటి చొరవ చూపించడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విద్యుత్ పరిస్థితి అథోగతిలోనే ఉందని, తన అనుభవాన్నంతా రంగరించి ఎంతో శ్రమ చేసి అక్కడ విద్యుత్ సరఫరాను కొంత మెరుగు పరిచానని ఆయన అన్నారు.
తెలంగాణలో ఇటువంటి చొరవ లోపించడం వల్లే సమస్యలు పెరిగాయని, అది గ్రహించకుండా రోజూ నన్ను తిట్టిపోస్తే తానేం చేయగలనని ఆయన అన్నారు. ఆయన అధ్యక్షతన సోమవారం తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, విద్యుత్పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాషా్ట్రల మధ్య చోటుచేసుకొన్న వివాదం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై చంద్రబాబు మాట్లాడారు.
ఎపిలో కూడా విద్యుత్ మిగులేమీ లేదని, తాను వచ్చిన తర్వాత ప్రత్యేకంగా దృష్టి పెట్టి విద్యుత్ ఉత్పత్తిని పెంచానని, తెలంగాణలో ముందస్తు వ్యూహం లేకుండా వదిలేశారని, ఇప్పుడు హడావుడి పడితే ప్రయోజనం ఉండటం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో విద్యుత్ సమస్య ఉంటుందని ముందు నుంచీ అందరికీ తెలుసునని, ప్రభుత్వాన్ని పాలించేవాళ్లు దానిని గుర్తించి ముందు చూపుతో పనిచేయాలని చంద్రబాబు అన్నారు.

మేం కోరడం వల్లనే అన్నట్లు..
శ్రీశైలం రిజర్వాయర్లో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఏపీ ప్రభుత్వం కోరినందువల్లే తెలంగాణలో విద్యుత్ సమస్య వచ్చిందన్నట్లుగా మాట్లాడుతున్నారని, ఈ సమస్య ఈ నాలుగు రోజులదని, మరి అంతకు ముందు నుంచీ తెలంగాణలో విద్యుత్ సమస్య ఎందుకుందని చంద్రబాబు అన్నారు.

నెట్టే ప్రయత్నం..
విద్యుత్ ఇవ్వలేని వైఫల్యాన్ని ఎవరో ఒకరిపై నెట్టి తప్పించుకొనే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని, ఎల్లయ్య మీదో పుల్లయ్య మీదో నెట్టి చేతులు దులుపుకొంటే ప్రజలు హర్షించరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ విషయాలన్నిటినీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.

రైతు ఆత్మహత్యలపై చర్చ
తెలంగాణలో పెద్ద సంఖ్యలో చోటు చేసుకొంటున్న రైతు ఆత్మహత్యలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రభుత్వం స్పందించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని తెలంగాణ పార్టీ నేతలు పని చేయాలని సమావేశం నిర్ణయించింది.

పార్టీ సభ్యత్వం నమోదు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నవంబర్ మూడో తేదీ నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ప్రారంభించాలని టిడిపి నిర్ణయించింది. సభ్యత్వ నమోదును సమన్వయం చేయడానికి రెండు రాష్ట్రాలకూ సీనియర్ నేతలతో వేర్వేరు కమిటీలను నియమించింది.

తుఫాను మృతుల కుటుంబాలకు సంతాపం
హుద్హుద్ తుపాను విలయంలో మరణించిన వారి కుటుంబాలకు పొలిట్బ్యూరో సంతాపం తెలిపిందని రావుల చంద్రశేఖర రెడ్డి, పయ్యావుల కేశవ్ సమావేశానంతరం తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు చేసిన కృషిని, యుద్ధప్రాతిపదికన పునరావాస కార్యక్రమా లు చేపట్టిన అధికార యంత్రాంగం, ప్రజలను ప్రత్యేకంగా అభినందించారు.

కేంద్రానికి అభినందనలు
సహాయంపై వెంటనే స్పందించి ఆదు కున్న కేంద్ర ప్రభుత్వానికి పొలిట్బ్యూరో అభినందనలు తెలిపింది. ఏపీలో 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నారని, భవిష్యత్లో విద్యుత్ సమస్యలను అధిగమించే చర్యలపై దృష్టి సారించాలని నిర్ణయించినట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications