స్త్రీలతో బాబు కలిసి తిని, భరోసా ఇచ్చారు (పిక్చర్స్)
అనంతపురం: మహిళల జోలికొస్తే ఖబడ్దార్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. మహిళలతో ఆయన గురువారం అనంతపురం జిల్లాలో సహపంక్తి భోజనం చేశారు. ఆ తర్వాత డ్వాక్రా మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇప్పటికీ మనలో ఆ కసి, ఆవేదన ఉన్నాయని, అదే కసితో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కష్టపడి పనిచేద్దామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచి మన శక్తి ఏమిటో నిరూపిద్దామని చెప్పారు. అందుకు తనతో అందరూ కలిసి రావాలని ప్రజలను కోరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణ, మేధాశక్తి, ఆర్థిక వనరులు సమీకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమస్యలను సవాల్గా తీసుకుని ముందుకు సాగుదామని చెప్పారు.
డ్వాక్రా సంఘాలకు సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక భవనాలు నిర్మిస్తామన్నారు. పౌష్టికాహార లోపంతో చిన్న పిల్లలు చనిపోతున్నారని, లక్ష మందిలో 136 మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్కరూ చనిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం అందించే బాధ్యతను తీసుకుంటామని, మహిళా సంఘాలకే పౌష్టికాహార పంపిణీ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు.
ఐదేళల్లో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఉద్యోగ, రాజకీయ రంగాల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. రాష్ట్రంలో వ్యవసాయపరంగా రూ.36 వేల కోట్లు, పండ్ల తోటల ద్వారా రూ.33 కోట్లు, పాడి, కోళ్ల పరిశ్రమల ద్వారా రూ.25 వేల కోట్లు, చేపల పెంపకం ద్వారా రూ.17 వేల కోట్ల ఆదాయం వస్తోందన్నారు. వాటి ద్వారా ఆదాయాన్నిపెంచే మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. ఇందులోనూ మహిళలకు ఉపాధి కల్పిస్తామన్నారు.
‘రాష్ట్ర విభజన తర్వాత కష్టాలొచ్చాయ్... అయినా ఎవరూ అదైర్యపడవద్దు' అని ప్రజలకు ధైర్యం నూరిపోశారు. జపాన్పై అణుబాంబు దాడి జరిగినప్పుడు అక్కడి ప్రజలు మనో ధైర్యంతో ముందుకుపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 20 ఏళ్లలో అభివృద్ధిలో అగ్రగామిగా ఆ దేశం నిలిచిందన్నారు.
పదేళ్లు పాలించిన కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. అనేక అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారన్నారు. గతంలో తన హయాంలో రూ.3 వేల కోట్లతో డ్వాక్రా సంఘాలను ప్రారంభించామని, అవి ఇప్పటికీ అదే స్థితిలోనే ఉన్నాయని ఆవేదన చెందారు. కాంగ్రెస్ పాలకుల అసమర్థపాలనే ఇందుకు నిదర్శనమని చెప్పారు.

చంద్రబాబు సహపంక్తి భోజనం
అనంతపురం జిల్లా పుట్టపర్తి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు మహిళలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

సహపంక్తి భోజనం
పోలీసులకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే... ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకుని రక్షణ కల్పిస్తారని తెలిపారు. ప్రతి మహిళా ధైర్యంగా తిరగబడాలని,‘ఒక అన్నగా... ఒక తమ్ముడిగా మీకు అండగా ఉంటాన'ని చంద్రబాబు మహిళలకు భరోసా ఇచ్చారు.

సహపంక్తి భోజనం
ఎన్నికల హామీల్లో భాగంగా మహిళా సాధికారత కోసం డ్వాక్రా రుణాలు మాఫీ చేశామని చంద్రబాు తెలిపారు. మళ్లీ రూ.20 వేల కోట్లు వడ్డీలేని రుణాలు అందిస్తామని మరో కానుక అందించారు.

సహపంక్తి భోజనం
మహిళలకు ప్రత్యేకంగా బ్యాంకును ఏర్పాటు చేస్తామని, మహిళల అభివృద్ధి కోసం ఒక ప్రాజెక్టును ఏర్పాటుచేసి అభివృద్ధి బాధ్యతను వారికే అప్పజెబుతామని చంద్రబాబు తెలిపారు.

సహపంక్తి భోజనం
చంద్రబాబుతో మహిళల సహపంక్తి భోజనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఇలా కనిపించారు.

సహపంక్తి భోజనం
మహిళలతో సహపంక్తి భోజనంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు శమంతకమణి ఇలా భోజనం చేస్తూ కనిపించారు.












Click it and Unblock the Notifications