రాష్ట్ర విభజన: దిగ్గజాలంతా సీమాంధ్రకే (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయ దిగ్గజాలంతా సీమాంధ్రకే పరిమితమైనట్లు కనిపిస్తున్నారు. తెలంగాణకు కూడా తామే నాయకులమని చెప్పుకుంటున్నప్పటికీ వారు దృష్టంతా సీమాంధ్రపైనే ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో వారు చేసేది కూడా చాలా తక్కువగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రెండు ప్రాంతాలకు పార్టీల అధినేతలుగా వ్యవహరిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి పూర్తిగా సీమాంధ్రకే పరిమితమైనట్లు కనిపిస్తున్నారు. కాంగ్రెసు రెండు కమిటీలను వేయడంతో చిరంజీవి, బొత్స సత్యనారాయణ వంటి నాయకులు సీమాంధ్రకే పరిమితం కాక తప్పడం లేదు.
తాజాగా, రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సీమాంద్రకే ఆకర్షణకే నిలిచేట్లున్నారు. మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి సీమాంధ్ర బిజెపి ప్రచార రథసారథిగా నియమితులయ్యారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వైయస్ విజయమ్మ, షర్మిల కూడా తెలంగాణలో ఏ మేరకు తమ పాత్ర నిర్వహిస్తారనేది సందేహంగానే ఉంది.
చిరంజీవి పెద్ద దిక్కు..
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ముఖ్యమంత్రి కావాలని భావించి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీకి పెద్ద దిక్కుగా మారారు.
జగన్ సీమాంధ్రకే...
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కూడా సమైక్యాంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు సీమాంధ్ర ముఖ్యమంత్రి కావడానికి ఆ ప్రాంతంపైనే దృష్టి కేంద్రీకరించారు.
చంద్రబాబు కూడా..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ల పాటు పనిచేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీమాంధ్రకు ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తెలంగాణకు బిసిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు.
కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా..
సమైక్యాంధ్ర ప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి చరిత్ర పుస్తకాల్లో పేరు సంపాదించుకునే అవకాశం ఉంది. ఆయన జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి సీమాంధ్రలో ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
వెంకయ్యనాయుడు ఇలా..
రెండు ప్రాంతాలకు బిజెపి నేతలకు వెంకయ్య నాయుడు పెద్ద దిక్కుగా ఉన్నారు. అయితే, సీమాంధ్రలో పోటీ చేసి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు రావాలని ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది.
దగ్గుబాటి సీమాంధ్రకే..
కాంగ్రెసు నేతగా, కేంద్ర మంత్రిగా ఉంటూ వచ్చిన ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపికి సీమాంద్రలో ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఆమె తెలంగాణకు వచ్చే అవకాశం లేదు
పవన్ కళ్యాణ్ అంటున్నారు..
తెలంగాణలో కూడా తాను నాయకుడిగా ముందుకు రావడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఆయన సీమాంధ్రలోనే ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశాలున్నాయి.
విజయమ్మ వస్తారా..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తెలంగాణలో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అది ఆచరణ సాధ్యమవుతుందా అనేది చూడాల్సి ఉంది.
బాలకృష్ణ కూడా అటే..
తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా మారనున్న నందమూరి హీరో బాలకృష్ణ కూడా సీమాంధ్రకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైయస్ షర్మిల పరిస్థితి..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, జగన్ సోదరి వైయస్ షర్మిల తెలంగాణలో పోటీ చేస్తారని అంటున్నారు. కానీ ఆమె అందుకు అంగీకరిస్తారా అనేది వేచి చూడాలి.