ఆంధ్రలోని ఇంజనీర్లను రప్పిద్దాం: హరీష్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ఇంజనీర్ల జేఏసీ, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం సంయుక్తంగా శుక్రవారం ఎర్రమంజిల్లోని జలసౌధలో నవాబ్ అలీ నవాజ్ జంగ్ జయంతి సందర్భంగా ‘తొలి తెలంగాణ ఇంజనీర్స్ డే' ఉత్సవం నిర్వహించాయి. మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా పాల్గొని, జంగ్ వారసుల సమక్షంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. జంగ్ వారసులను, నీటి పారుదల శాఖ సలహాదారుడు ఆర్.విద్యాసాగర్రావును సత్కరించారు.
నవాజ్ జంగ్ స్ఫూర్తితో పోరాటంలా తెలంగాణ పునర్నిర్మాణం చేపడదామని, కేవలం కట్టడాలుగా కాకుండా జాతికి ఉపయోగపడే ప్రాజెక్టులు, నిర్మాణాలు చేపడదామని, జంగ్ నిర్మాణాలు తెలంగాణ సంపద అని, ఇంజనీర్ల కృషి రేపటి తెలంగాణ జాతి సంపద కావాలని, ఇకపై ప్రాజెక్టుకు పనిచేసే ఇంజనీర్ల పేర్లన్నీ శిలాఫలకాలపై నమోదు చేయిస్తామని హరీష్ రావు అన్నారు
ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఇంజనీర్లను ఇక్కడికి తెచ్చుకుందామని, ఉద్యోగుల శాశ్వత విభజన పూర్తయ్యేంతవరకు వేచి ఉండాలని ఇంజనీర్లకు మంత్రి సూచించారు. రిటైర్డ్ ఇంజనీర్ల సేవలను కూడా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలో ఉత్తర్వులు జారీ అవుతాయన్నారు. త్వరలో నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న 600 ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. దీనికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అంగీకరించారని తెలిపారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో..
అలీ నవాజ్ జంగ్ బహదూర్ నిర్మించిన ఉస్మానియా యూనివర్సిటీలో ముస్లిం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆయన 137వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఈ కార్యక్రమానికి హాజరై నిజామ్ నవాబులు చేసిన కృషిని కొనియాడారు.
నవాబ్ అలీ నవాజ్ జంగ్ జయంతి
హైదరాబాద్ నగరంలో అనేక ప్రాజెక్టులతో పాటు అంతర్గత మురుగునీటి పారుదల వ్యవస్థను రూపొందించిన తొలి తెలంగాణ నీటిపారుదల పితామహడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సృష్టికర్త
ఆయన రూపొందించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీయే ఇప్పటికీ అవసరాలు తీరుస్తోంది. శుక్రవారం ఆయన జయంతి ఈ సందర్భంగా ఇంజనీర్స్ డే జరిగింది.
సొంత గడ్డపై...
సొంతగడ్డ మీద స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న భావన ఎంతో తృప్తినిస్తోందని ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు అన్నారు. ఇంజనీర్లు అంటే ఆర్దర్ కాటన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కేఎల్ రావు పేర్లే చెబుతారని, తెలంగాణలో అద్భుతమైన ఇంజనీర్లు ఉన్నా గుర్తింపు లేకుండా పోయిందని అన్నారు.
ఐదు, ఆరు జోన్లకు సంబంధించిన ఇంజనీర్లు సహకరిస్తే సర్వీసు వివాదాలను పరిష్కరించి, అవసరమైతే సూపర్న్యూమరీ పోస్టులను సృష్టించి, రెగ్యులర్ పదోన్నతులు కల్పిస్తామని ప్రకటించారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణ ఇంజనీర్ల సంఘం కార్యాలయ నిర్మాణానికి భూమితో పాటు 50 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందజేస్తామని ప్రకటించారు.
తనకు, తన పిల్లలకూ జంగ్ వంటి తెలంగాణ ఇంజనీర్ల పేర్లు వినిపించనే లేదని, ఇక చరిత్రను వక్రీకరించడం ఎవరి వల్లా కాదని ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి అన్నారు. తాను జంగ్ నిర్మించిన ఆర్ట్స్ కాలేజీలో చదివానని, తక్కువ ఖర్చు, తక్కువ నీటితో ఎక్కువ ఫలితాలు పొందేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి బి. అరవిందరెడ్డి అన్నారు.
జంగ్ స్ఫూర్తితో ఇంజనీర్లు తెలంగాణ సోయితో పనిచేయాలని, కృష్ణా గోదావరి జలాల మళ్లింపుపై ప్రధాన దృష్టి పెట్టాలని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం జనరల్ సెక్రటరీ శ్యాం ప్రసాద్ రెడ్డి అన్నారు. మింట్ కాంపౌండ్లోనూ ఇంజనీర్స్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నవాబ్ జంగ్ మనుమడు, ట్రాన్స్కో డైరెక్టర్ అన్వరుద్ధీన్ ప్రసంగించారు.