ఏపీలో ఆస్తిపన్ను పెంపు 600 శాతం-మూలధన విలువతో పెంపే కారణం-హైకోర్టు పిల్
ఏపీలో తాజాగా వైసీపీ సర్కార్ ఆస్తిపన్నును భారీగా పెంచింది. 15 శాతం మాత్రమే పెంచినట్లు చెప్పుకుంది. కానీ తాజాగా హైకోర్టులో దాఖలైన ఓ పిల్ లో పిటిషనర్లు ప్రభుత్వ నిర్ణయంతో ఏకంగా 600 శాతం వరకూ పన్ను పెరగబోతోందని చెప్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
ఏపీలో వైసీపీ సర్కార్ తీసుకున్న ఆస్తిపన్ను పెంపు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ఇందులో ప్రభుత్వం గతంలోలా వార్షిక అద్దె విలువ ఆధారంగా కాకుండా మూలధన విలువ ఆధారంగా పన్ను పెంచడాన్ని పిటిషనర్లు తమ వాజ్యంలో సవాల్ చేశారు. ప్రభుత్వం ఇలా మూలధన విలువ ఆధారంగా పన్వు లెక్కించడం మొదలుపెడితే ఏకంగా పన్ను పెంపు గరిష్టంగా 600 శాతం కూడా ఉంటుందని వారు హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
వాస్తవానికి రాష్ట్రంలో ఆస్తిపన్ను పెంచాలంటే మున్సిపల్ చట్టం ప్రకారం రాష్ట్ర ఆస్తిపన్ను బోర్డు ఏర్పాటు చేయాలని, కానీ ప్రభుత్వం ఏకపక్షంగా పన్ను పెంచుతూ నిర్ణయం తీసుకుందని పిటిషనర్లు తమ పిల్ లో ఆరోపించారు. ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి ఆస్తిపన్ను పెంచడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. నవరత్నాల అమలు కోసం పన్నుల విధానంలో మార్పులు చేసి ప్రజలపై భారం మోపడం సరికాదని వారు చెప్తున్నారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రేపు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశముంది.
udaya bhanu కవల పిల్లలు.., స్టార్ హీరోల పిల్లలకు తగ్గకుండా ఎంత క్యూట్ గా ఉన్నారో (ఫొటోస్)
మరోవైపు రాష్ట్రంలో పెంచిన ఆస్తిపన్నుపై జనం గగ్గోలు పెడుతున్నారు. పలు కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు చేస్తున్న చట్ట సవరణల తీర్మానాలకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రభుత్వం మాత్రం కేవలం 15 శాతమే పన్ను పెరుగుతోందని చెబుతోంది. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేకపోవడంతో ప్రభుత్వం కూడా ప్రజావ్యతిరేకతను లెక్కచేయకుండా ఆస్తిపన్ను పెంపుపై కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం చేసిన మున్సిపల్ చట్ట సవరణ ఆధారంగా పట్టణ స్ధానిక సంస్ధలు ఆస్తిపన్ను పెంచుతూ తీర్మానాలు చేస్తున్నాయి. వీటిపై కౌన్సిళ్లలోనూ విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా ప్రభుత్వం లెక్క చేసే పరిస్దితుల్లో లేదు.