నల్లారికి పెద్దిరెడ్డి షాక్ - వైసీపీలోకి పీలేరులో టీడీపీ నేతలు...!!
ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చిత్తూరు జిల్లా కీలకంగా మారింది. సీఎం జగన్ ఈ సారి చంద్రబాబు కంచుకోట కుప్పం పైన ఫోకస్ పెట్టారు. కుప్పం బాధ్యతలను అక్కడ అభ్యర్ధి భరత్ తో పాటుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఇప్పటికే భరత్ ను కుప్పం అభ్యర్ధిగా ముఖ్యమంత్రి ప్రకటించారు. 2024 ఎన్నికల కోసం అక్కడి నుంచే అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టారు. దీనికి కౌంటర్ గా టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో ఎలాగైనా గెవాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇదే జిల్లాలో రెండు పార్టీలకు మరో కీలక నియోజకవర్గం పీలేరు. ఇప్పుడు అక్కడ రాజకీయంగా కీలక పరిణామాల..సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి.
పీలేరు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి సొంత నియోజకవర్గం. ఇప్పుడు అక్కడ కిరణ్ సోదరుడు కిషోర్ టీడీపీలో చేరటంతో ఆయన పార్టీ ఇంఛార్జ్ గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కిశోర్ కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్ధి చింతల రామచంద్రా రెడ్డి పైన 7,874 ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోనే చేరినా..పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. తమ్ముడు కిశోర్ రెడ్డి టీడీపీలో చేరటంతో కిరణ్ మౌనం దాల్చారు. ఇక, వచ్చే ఎన్నికల్లోనూ పీలేరు నుంచి టీడీపీ అభ్యర్ధిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేయనున్నారు. నల్లారి సోదరుల టార్గెట్ పీలేరు నియోజకవర్గంతో పాటుగా మంత్రి రామచంద్రారెడ్డి. దీంతో, మంత్రి పెద్దిరెడ్డి ఇదే పీలేరులో తన పట్టు నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి పీలేరులో టీడీపీ నేతలతో కలిసి సీఎం జగన్ ను కలిసారు. పీలేరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జివి శ్రీనాథ్రెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. శ్రీనాథ్రెడ్డితో పాటు పీలేరు నియోజకవర్గ టీడీపీ నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. వారిని సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మైనారిటీస్ కమిషన్ చైర్మన్ ఇక్భాల్ అహ్మద్ ఖాన్ వారితో పాటుగా సీఎం వద్దకు వచ్చారు. ఈ నియోజకవర్గంతో పాటుగా పెద్దిరెడ్డి ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ గెలవాలని ఫిక్స్ అయిన నియోజకవర్గాల నుంచి పార్టీలో చేరికలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. నల్లారి వర్సస్ పెద్దిరెడ్డి కాంగ్రెస్ లో ఉన్న సమయం నుంచి కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ..చిత్తూరు జిల్లా కేంద్రంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది.