కిరణ్కు షాక్: టిడిపిలోకి పితాని, డిఎల్ కూడా
హైదరాబాద్: మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నారు. జై సమైక్యాంధ్ర పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. ఆయన శనివారంనాడు పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ము చిక్కాల గ్రామంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. టిడిపిలో చేరాలని కార్యకర్తలు పట్టుబడుతున్నారని ఆయన చెప్పారు. కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రెండు రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, వలసలతో తెలుగుదేశం పార్టీ నిండిపోతోంది. శుక్రవారం మాజీ మంత్రి తోట నరసింహం తన అనుచరులతో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు రాజమండ్రి మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర, చిలకలూరిపేట కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ అనపర్తి లక్ష్మయ్య, పెదకూరపాడు నియోజకవర్గ కాంగ్రెస్ నేత నూర్జహాన్ తమ అనుచరులతో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. చిలకలూరి పేట మున్సిపల్ మాజీ చైర్మన్ జంపాల కోటేశ్వరి, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి ఏఎం రాధాకృష్ణ కూడా పార్టీలో చేరారు.

బాబుతో డిఎల్ భేటీ..
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి శుక్రవారం చంద్రబాబుని కలిశారు. ఆయన టిడిపిలో చేరుతారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కడపలో ప్రజాగర్జన నిర్వహించి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారని అంటున్నారు. కర్నూలు ప్రజాగర్జన సందర్భంగా మంత్రాలయానికి చెందిన పిసిసి సంయుక్త కార్యదర్శి పి. తిక్కారెడ్డి, పార్థసారథి, ఆళ్లగడ్డ కాంగ్రెస్నేత గంగుల ప్రభాకరరెడ్డి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
కాగా, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎంపీ సీటుకు టిడిపి అభ్యర్థిగా తోట నరసింహం ఖరారయ్యారు. ఆ పార్టీ వర్గాలు ఈ విషయాన్ని ద్రువీకరించాయి. ఆయన మామ మెట్ల సత్యనారాయణ టిడిపి సీనియర్ నేత కావడం నరసింహంకు బెర్త్ ఖరారులో ఉపయోగపడింది.












Click it and Unblock the Notifications