మోక్షజ్ఞ హత్య కేసు ట్విస్ట్: టెక్కీ భర్తపై భార్య డౌట్
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ఏడాదిన్నర చిన్నారి మోక్షజ్ఞ తేజ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. తండ్రి, కుటుంబ సభ్యులే చిన్నారిని చంపి ఉంటారని మోక్షజ్ఞ తల్లి విమల ఆరోపించారు. తన భర్త భాస్కరరావుకు జాతకాల పిచ్చి ఉందని విమల చెప్పారు. మోక్షజ్ఞ తండ్రి కీడుతో పుట్టాడని జాతకం చెప్పారని వివరించారు.
మోక్షజ్ఞ హత్య వెనుక కుటుంబ సభ్యుల పాత్ర ఉంటుందని విమల సందేహం వ్యక్తం చేశారు. జాతకాల పిచ్చితో తన భర్తే తండ్రి చంపి ఉండొచ్చని విమల అన్నారు. ఈ మేరకు శనివారం మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. ఆ మీడియా కథనాలు ఇలా ఉన్నాయి -
విజయవాడ సమీపంలో కనకదుర్గమ్మ వారిధి పై నుంచి మోక్షజ్ఞను కృష్ణానదిలోకి విసిరి చంపేసిన సంగతి తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి ఏడాదిన్నర వయస్సుగల చిన్నారిని తెనాలిలో ఉంటున్న సొంత బాబాయి గోడపాటి హరిహరణ్ కృష్ణానదిలోకి విసిరేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.
మోక్షజ్ఞ తల్లిదండ్రులు విమల ప్రియ, భాస్కరరావు ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ మోక్షజ్ఞ తేజను ఆరు నెలల కిందట తెనాలిలో ఉంటున్న తాతయ్య, నానమ్మ రాంబాబు, జానకిల వద్ద వదిలి వెళ్లారు.
జులాయిగా తిరుగుతున్న హరిహరణ్ను భాస్కరరావు మందలించడం వల్లనే కక్ష పెట్టుకుని మోక్షజ్ఞను అతను చంపేశాడని ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ కేసు విమల ఆరోపణలతో మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది.