అమరావతిలో 12వేల క్వార్టర్లు: ఎవరికి ఏ ప్లాట్లు ఇస్తారంటే..
విజయవాడ: ఏపీ సచివాలయ సిబ్బంది అమరావతికి తరలి వస్తున్న నేపథ్యంలో 12వేల క్వార్టర్లు నిర్మించాలని సీఆర్డీఏ ప్రణాళిక సిద్ధం చేసింది. సమాచార శాఖ రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగం సోమవారం నాు మీడియాకు ఆ వివరాలు విడుదల చేసింది.
న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఉద్యోగులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్లాట్లు, ఇళ్లు ఇవ్వనున్నారు. గృహ నిర్మాణ శాఖకు చెందిన ముగ్గురు ఇంజినీర్లతో ప్లాన్ను రూపొందించారు. ఏడు కేటగిరీలుగా మంత్రులు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మించనున్నారు.
ఇప్పటికే రాజధానిలో ఇళ్లు దొరకడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా క్వార్టర్లు నిర్మించాలని చూస్తున్నారు. వీరిలో న్యాయమూర్తులు, న్యాయాధికారులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు వ్యక్తిగత డూప్లెక్స్ ఇళ్లు, మిగిలిన అధికారులు, ఉద్యోగులకు జీ ప్లస్ 9 అపార్ట్మెంట్లు నిర్మించి ఇస్తారు.
ఈ ప్రణాళిక ప్రకారం.. న్యాయమూర్తులు ఉన్నత న్యాయాధికారులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు 3,500 చ.అ. విస్తీర్ణంలో విశాలమైన వ్యక్తిగత డూప్లెక్స్ ఇళ్లు నిర్మిస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీ ప్లస్ 9 అపార్ట్మెంట్లు నిర్మించి 3,500 చదరపుటడుగుల విస్తీర్ణంలోనే డూప్లెక్స్ కాకుండా ఫ్లాట్లు ఇస్తారు.
అఖిల భారత సర్వీసుల జూనియర్ అధికారులు, హెచవోడీలకు మూడు వేల చదరపుటడుగుల విస్తీర్ణంతో ఫ్లాట్లు కేటాయిస్తారు. గెజిటెడ్ అధికారులకు 1,800 చదరపుటడుగులు, నాన గెజిటెడ్ అధికారులకు 1,200 చదరపుటడుగులు, నాలుగోతరగతి ఉద్యోగులకు 800 చదరపుటడుగు విస్తీర్ణంలో ఒక్కో ఫ్లాట్ ఉండేలా జీ ప్లస్ 9 అపార్టుమెంట్లు నిర్మిస్తారు.
గెజిటెడ్ అధికారులకు మూడు పడక గదులు, నాన గెజిటెడ్ అధికారులకు రెండు పడక గదులు, నాలుగో తరగతి ఉద్యోగులకు కూడా తక్కువ విస్తీర్ణంలోనే రెండు పడక గదులతో ప్లాట్లు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అఖిల భారత సర్వీసుల జూనియర్ అధికారులకు 4 పడక గదుల ప్లాట్లు కేటాయించనున్నారు.