సీఆర్డీఏ పరిధి పెంపు: పాలన కోసం అద్దెకు ప్లాట్లు, మంత్రులకు విల్లాలు
అమరావతి: విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పరిపాలన కొనసాగించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పాలనకు అవసరమైన మౌలిక వసతులపై దృష్టి పెట్టింది.
ఈ క్రమంలో గుంటూరులోని నాగుర్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న ఏజేఎం రెయిన్ ట్రీ పార్కుతో ఒప్పందం కదుర్చుకుని అందులోని 256 ప్లాట్లను, 26 విల్లాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
స్వాధీనం చేసుకున్న వాటిలో ఐఏఎస్, సీనియర్ అధికారులు నివాసాలుగా వినియోగించనున్నారు. మంత్రులకు విల్లాలు కేటాయించనున్నారు. ఇప్పటికే విజయవాడలోనే సీఎస్, డీజీపీలు తమ కార్యకలాపాలను నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడలోనే బస చేసేందుకు వీలుగా వసతులు కల్పించనున్నారు.
దీంతో ఏపీలో పరిపాలను మరింత వేగవంతం కానుంది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్ధిక భారంగా మారనుంది. అటు హైదరాబాద్ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించడంతో అక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులు పని చేయాల్సి ఉండటం, నూతన రాజధానిలో ఇక్కడ పనిచేయాల్సి ఉండటంతో అటు అధికారులకు కాస్తంత ఇబ్బందిగా మారింది.
ప్రస్తుతం హైదరాబాద్లో ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏ ఇస్తున్నారు. విజయవాడలో 20 శాతం, అమరావతిలో 12 శాతం హెచ్ఆర్ఏ ఇస్తున్నారు. అయితే రాజధానికి వెళ్లే ఉద్యోగులకు హెచ్ఆర్ఏలో కోత విధించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పాలనను మరింత దగ్గరకు చేర్చాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వారంలో ఐదు రోజులు విజయవాడలోనే ఉంటున్నారు. ఏపీ రాజధానికి ప్రాంతానికి కార్యలయాల తరలింపు ప్రక్రియను కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందుకోసం ఐదుగురు ఐఏఎస్లతో కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కమిటీ సభ్యులుగా ఐఏఎస్ అధికారులు జవహర్రెడ్డి, లవ్ అగర్వాల్, శ్యాంబాబు, జయలక్ష్మీ, హేమ మునివెంకటప్పలను కమిటీ సభ్యులుగా నియమించారు. రాజధాని ప్రాంతానికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియను ఈ ఏడాదే పూర్తి చేయాలని ఈ కమిటీ భావిస్తోంది.
సీఆర్డీఏ పరిధిని పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి సీఆర్డీఏ పరిధిని పెంచుతూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఆర్డీఏ పరిధి 7068.20 చదరపు కిలోమీటర్లుగా ఉంది. దీనిని 8052.69 చదరపు కిలోమీటర్లుగా పెంచింది.
దీంతో కృష్ణాజిల్లాలోని జగ్గయ్య పేట మున్సిపాలిటీతో సహా 123 గ్రామాలు సీఆర్డీఏ పరిధిలోకి రానున్నాయి. సీఆర్డీఏ పాలకమండలిని సైతం ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది.