మోడీ! దీక్ష కాదు, రాజీనామా చెయ్: భగ్గుమన్న టీడీపీ, '5 రోజుల్లో 5వికెట్లు ఆశ్చర్యం'
అమరావతి: కాంగ్రెస్ పార్టీ తీరుకు నిరసనగా ప్రధాని నరేంద్ర మోడీ చేయనున్న దీక్షపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. సీఎం చంద్రబాబు, మంత్ర నారా లోకేష్, ఇతర మంత్రులు, టీడీపీ నేతలు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు నడవకపోవడానికి బీజేపీ, మోడీయే కారణమని, ఇప్పుడు వారే దీక్ష చేయడం విడ్డూరమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
చదవండి: విజయమ్మ 'పాదనమస్కారం'పై లోకేష్, టీడీపీకి యడ్యూరప్ప-జవదేకర్ దిమ్మతిరిగే షాక్
ప్రధాని నరేంద్ర మోడీ తీరు దొంగే దొంగ... దొంగ అన్నట్లుగా ఉందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. మోడీ, అమిత్ షా నిరసనలు ఎందుకో చెప్పాలన్నారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే బాగోతం బయటపడుతుందనే బీజేపీ పారిపోయిందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు.
చదవండి: అశోక్ గజపతి రాజుకు చేదు అనుభవం, ఎయిర్ ఇండియా సిబ్బంది షాక్!
మోసం చేస్తే ఎదురుతిరిగాం
ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేశాక మోడీ దీక్ష చేయాలని నారా లోకేష్ అన్నారు. అవిశ్వాసంపై చర్చ జరగొద్దని గందరగోళం సృష్టించారన్నారు. సభను అడ్డుకున్నది బీజేపీనే అని, ఇప్పుడు వారు దీక్ష ఎందుకు చేస్తున్నారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రజల మనోభావాలతో ప్రధాని నరేంద్ర మోడీ ఆడుకుంటున్నారని ఆరోపించారు. హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటే అంగీకరించాని, ఆ తర్వాత మోసం తెలిసి ఎదురు తిరిగామన్నారు.
కేంద్రం తలచుకుంటే
కేంద్రం తలచుకుంటే కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయొచ్చని చంద్రబాబు అన్నారు. సుప్రీం కోర్టు కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించిందని, దానిని ఏర్పాటు చేయకుండా మోడీని ఎవరు ఆపారని ప్రశ్నించారు. తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరీ జలాల వివాదం పరిష్కరించేందుకు కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభలో ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. ఇతర పార్టీలతో చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్లో టీడీపీని బలహీనం చెయ్యాలని చూస్తున్నారు. కానీ, టీడీపీ చాలా బలమైన పార్టీ అని చంద్రబాబు పేర్కొన్నారు.
మోడీ దీక్ష కాదు రాజీనామా చెయ్
ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రధాని మోడీ దీక్ష చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. నరేంద్ర మోడీ దీక్ష చేయడం కంటే రాజీనామా చేయడం ఉత్తమం అని టీడీపీ నేత, మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నామని, ఇందుకోసం దేనికైనా సిద్ధమని ప్రకటించారు.
మావి రాత్రికి రాత్రే ఆమోదించారు, మీ మాటేమిటి?
టీడీపీ నేతలు బీజేపీతో పాటు వైసీపీ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ లోకసభ ఎంపీలు రాజీనామాలు చేశారు సరే, రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ, బీజేపీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని టీడీపీపీ సెక్రటరీ సత్యనారాయణ విమర్శించారు. ఇద్దరు కేంద్రమంత్రులు రాజీనామా చేస్తే రాత్రికి రాత్రే ఆమోదించారని, వైసీపీ ఎంపీల రాజీనామాలు ఇప్పటి వరకు ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. విజయసాయి ఎందుకు రాజీనామా చేయలేదన్నారు. ఎంపీల రాజీనామాలు ఎందుకు ఆమోదించలేదో విజయసాయి చెప్పాలన్నారు. చంద్రబాబును విమర్శించే అర్హత విజయసాయికి లేన్నారు.
ఐదు రోజుల్లో ఐదు వికెట్లు ఆశ్చర్యం
ఆమరణ దీక్షకు వైసీపీ కొత్త అర్థం చెప్పిందని ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న అన్నారు. ఐదు రోజుల్లో ఐదు వికెట్లు పడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. అవినీతి గురించి విజయ సాయి రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. ప్రధాని వద్ద విజయసాయి బ్రోకరేజీ చేస్తున్నారని ఘాటుగా విమర్శలు చేశారు. బీజేపీ నేత సోము వీర్రాజుది అవినీతి చరిత్ర అన్నారు.
హోదా కోసం నిర్మాత నట్టి కుమార్ పిలుపు
ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు తెలుగు చిత్ర పరిశ్రమ ఏకతాటి పైకి రావాలని సినీ నిర్మాత నట్టి కుమార్ అన్నారు. హోదా సాధన కోసం ఒక రోజు బందు పాటించి దీక్షకు కూర్చునేందుకు సినీ నటులు ముందుకు రావాలన్నారు. హైదరాబాదుతో పాటు ఏపీలో నిరసనలు తెలుపుదామన్నారు. ఒక తేదీని నిర్ణయించి షూటింగులు బందు చేయడంతో పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలన్నారు. హోదా కోసం చిత్ర పరిశ్రమ వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెట్టి ఉద్యమించాలన్నారు.