ఎందుకో మోడీ చెప్పరు ! ఎందుకని జగన్ అడగరు ! బీభత్సంగా వాడేసుకుంటున్న చంద్రబాబు
వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా స్తబ్దుగా, ఏకపక్షంగా సాగిపోతున్న రాజకీయాల్లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అదీ నాలుగేళ్ల విరామం తర్వాత రాజకీయాల్లో ఆసక్తికర చర్చలకు, అంతకు మించిన ఊహాగానాలకు ఇది కారణమవుతోంది. అయినా దీనిపై ప్రధాన పార్టీల అధినేతలు కానీ, ఇతర కీలక నేతలు కానీ వాస్తవ పరిస్ధితులకు అనుగుణంగా స్పందించడం లేదు. దంతో జనంలోనూ అనుమానాలు పెరుగుతున్నాయి.
ఏపీ పాలిటిక్స్ లో టర్నింగ్
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. మరో రెండేళ్లలో ఎన్నికలు ఎదుర్కొనేందుకు ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. అదే సమయంలో విపక్షాలు కూడా వైసీపీని ఎలాగైనా గద్దెదించేందుకు అవసరమైతే కలిసి పోటీ చేసేందుకు సై అంటున్నాయి.
అయితే విపక్షాలన్నీ కలిసి వచ్చినా జగన్ ను ఏమీ చేయలేరని అధికార వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా భీమవరంలో ప్రధాని మోడీ టూర్ తర్వాత ఈ మార్పు చోటు చేసుకుంది. దీంతో రాబోయే రోజుల్లో ఏపీలో మారబోయే రాజకీయాల్లో ఇదో టర్నింగ్ పాయింట్ కాబోతోంది.
మోడీ-చంద్రబాబు చిట్ చాట్
తాజాగా ఢిల్లీలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో విపక్ష నేతలందరినీ కలిసిన ప్రధాని మోడీ.. వారితో పాటు ఈ కార్యక్రమానికి ఆహ్వనించిన టీడీపీ అధినేత, ఏపీ విపక్ష నేత చంద్రబాబును సైతం కలిశారు. వీరిద్దరి భేటీలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే దానిపై రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా గతంలో మోడీపై చంద్రబాబు చేసిన ధర్మపోరాటం గుర్తున్నవారందరికీ ఈ చర్చలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి.
బయటపడని మోడీ
చంద్రబాబుతో ఏం చర్చించారో ప్రధాని మోడీ ఇప్పటివరకూ ఎక్కడా బయటపడలేదు. తాను కోరుకుంటే చిన్నస్దాయి నేతలతో కూడా ఏం చర్చించారో ట్వీట్లు చేసే ప్రధాని మోడీ.. ఒకప్పటి తన మిత్రపక్ష నేత చంద్రబాబుతో ఏం మాట్లాడారో చెప్పే అవకాశం ఉన్నా దానిపై ఎక్కడా స్పందించలేదు. అలాగే బీజేపీలో కీలక నేతలు కానీ, జాతీయ, రాష్ట్ర స్ధాయి నేతలు కానీ మోడీ-బాబు చర్చల్లో చర్చకు వచ్చిన విషయాల్ని బయటపెట్టేందుకు సిద్ధంగా లేరు. కేవలం పైపై మాటలు, వ్యాఖ్యలే తప్ప అక్కడేం జరిగిందో చెప్పే పరిస్ధితి ఎవరికీ లేదు.
స్పందించని జగన్
అదే సమయంలో ఈ భేటీకి వెళ్లిన సీఎం జగన్ తో కలిసి ప్రధాని మోడీ ప్రత్యేకంగా విందు కూడా చేశారు. అయితే ఈ వివరాల్ని మోడీ-చంద్రబాబు భేటీపై ప్రచారం పీక్ కు వెళ్లిన నేపథ్యంలో వైసీపీ ప్రత్యేకంగా బయటపెడుతోంది. అయితే జగన్ మాత్రం మోడీ-చంద్రబాబు భేటీపై ఇప్పటివరకూ బహిరంగంగా ఎక్కడా స్పందించలేదు. అలాగే మోడీ-చంద్రబాబు ది కేవలం చిట్ చాట్ మాత్రమే కాగా.. తనతో మోడీ విందు చేశారనే విషయాన్ని జగన్ వైసీపీ ద్వారా ప్రచారంలోకి తెస్తున్నారు. తద్వారా తనకే మోడీ ఎక్కువగా ప్రాధాన్యమిచ్చారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Recommended Video
వాడేసుకుంటున్న చంద్రబాబు?
మోడీతో నాలుగేళ్ల విరామం తర్వాత భేటీ అయిన చంద్రబాబు ఇందులో చర్చించిన విషయాలపై కేవలం లీకులు మాత్రమే ఇచ్చారు. దాన్ని టీడీపీ అనుకూల మీడియా మరి కాస్త మసాలా దట్టించి కథనాలు ప్రసారం చేస్తోంది. కథనాలు రాస్తోంది. ఈ కథనాలు కాస్తా వైసీపీకి చికాకు పుట్టిస్తున్నాయి. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మోడీ-చంద్రబాబు చిట్ చాట్ పై రోజూ వరుస ట్వీట్లు పెడుతున్నారు. చివరికి జగన్-మోడీ విందును తెరపైకి తెచ్చి దీంతో పోలిస్తే బాబుతో ప్రధాని చిట్ చాట్ అసలు విషయమే కాదన్నట్లుగా ఫోకస్ చేస్తున్నారు. అయినా టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం హంగామాలో ఇవేవీ జనానికి చేరట్లేదు. దీంతో వైసీపీ ఈ విషయంలో గుర్రుగా కనిపిస్తోంది.