జల్లేరు వాగు బస్సు ప్రమాద మృతులకు ప్రధాని సంతాపం-2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెం సమీపంలో ఉన్న జల్లేరు వాగులో బస్సు పడిన ఘటనలో ఇవాళ 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ డ్రైవర్ తో పాటు 8 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబుతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు సంతాపాలు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మృతుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కూడా స్పందించారు.
జల్లేరు వాగు బస్సు ప్రమాద ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధాని మోడీ కార్యాలయం ఇవాళ ట్వీట్ చేసింది. బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రధాని జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం ట్వీట్ లో ప్రకటించింది.
జల్లేరు వాగు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోడీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధన్యవాదాలు తెలిపారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించడంపై సోము సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం పంపిన ట్వీట్ కు సోము వీర్రాజు రీట్వీట్ చేశారు. మరోవైపు జల్లేరు వాగు బస్సు ప్రమాదఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఇప్పటికే ప్రాధమిక విచారణ ఆధారంగా లారీని తప్పించబోయి ఈ బస్సు వాగులో పడిందని నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం మరింత లోతుగా దర్యాపు చేయాలని నిర్ణయించింది. బస్సు ప్రమాదంలో గాయపడిన వారి కుటుంబాల్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఇప్పటికే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్నినాని ప్రకటించారు. అలాగే సీఎం జగన్ కూడా బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే బాధిత కుటుంబాలకు డాక్టర్లు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.