పవన్ కు మోడీ రోడ్ మ్యాప్ ఇదేనా ? టీడీపీలేని విపక్ష పోరు ! అందుకేనా జనసేనాని మౌనం ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి విపక్షం కోసం ప్రయత్నిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోడీ వైజాగ్ పర్యటనలో రోడ్ మ్యాప్ దొరికిందా ? ఆ రోడ్ మ్యాప్ ఆధారంగానే ప్రస్తుతం ముందుకెళ్లేందుకు పవన్ ప్రయత్నాలు ప్రారంభించారా ? ఈ రోడ్ మ్యాప్ లో ఉమ్మడి విపక్షానికి బదులు బీజేపీ-జనసేనతో కూడిన పరిమిత విపక్షాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారానే 2024 ఎన్నికల్లో లబ్ది పొందాలని మోడీ సూచించారా ? ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
మోడీ వైజాగ్ టూర్
ప్రధాని మోడీ వైజాగ్ లో రెండు రోజుల పాటు పర్యటించారు. ఈ రెండు రోజుల్లో తొలిరోజు పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలతో భేటీ అయిన మోడీ.. రెండు రోజు మాత్రం సీఎం జగన్, గవర్నర్ లతో కనిపించారు. అలాగే తొలిరోజు రాజకీయ చర్చలతో తన టూర్ ప్రారంభించడం ద్వారా తన ప్రాధాన్యాలేంటో కూడా మోడీ చెప్పేశారు. రెండోరోజు మాత్రం అభివృద్ధి కార్యక్రమాల్లో గడిపారు. అక్కడా పలు సంకేతాలు ఇచ్చేశారు. దీంతో మోడీ టూర్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు ఇచ్చిన క్లారిటీపై ఇప్పుడు సర్వత్రా చర్చజరుగుతోంది.
మోడీ-పవన్ చర్చలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ప్రధాని మోడీ జరిపిన చర్చలు ఆయన వైజాగ్ టూర్ లో కీలకంగా మారాయి. అంతే కాదు పవన్ కళ్యాణ్ ను రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీగానే గుర్తించబోమంటున్న అధికార వైసీపీ సర్కార్ కు మోడీ ఇచ్చిన ఝలక్ గానే దీన్ని పరిగణిస్తున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో బీజేపీని పవన్ కళ్యాణ్ అడుగుతున్న రోడ్ మ్యాప్ ఇచ్చే విషయంలోనూ మోడీ-పవన్ చర్చలు కీలకంగా మారిపోయాయి. దీంతో ఈ భేటీకి ఎక్కడలేని ప్రాధాన్యం ఏర్పడింది. అయితే భేటీ తర్వాత పవన్ ముక్తసరిగా స్పందించడం చర్చనీయాంశమైంది.
పవన్ కు మోడీ రోడ్ మ్యాప్ ఇదే !
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో తిరిగి జనసేన-టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందన్న సంకేతాలు ఇస్తున్న పవన్ కళ్యాణ్.. ఈ మేరకు వైసీపీకి వ్యతిరేకంగా ఉమ్మడి విపక్షాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో టీడీపీని కూడా భాగస్వామిని చేద్దామని బీజేపీకి ప్రతిపాదిస్తున్నారు. ఇందుకోసం రోడ్ మ్యాప్ ఇమ్మని బీజేపీని కూడా కోరుతున్నారు. అయితే ప్రధాని మోడీ వైజాగ్ టూర్ లో ఈ మేరకు పవన్ కు క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి టీడీపీతో పొత్తు గురించి ఆలోచించవద్దని, బీజేపీ-జనసేన మాత్రం కలిసి సాగుతాయని, వచ్చే ఎన్నికల నాటికి అవసరాన్ని బట్టి టీడీపీతో పొత్తుపై నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కాస్త నిరుత్సాహానికి గురైనట్లు ఆ తర్వాత ఆయన మాటల్ని బట్టి అర్ధమైంది.
పవన్ మౌనం అందుకేనా ?
రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల ఉమ్మడి పోరుకు సహకరించాలని బీజేపీని కోరుతున్న పవన్, ఈ మేరకు తమ వంతుగా బీజేపీ-జనసేన ఉమ్మడి పోరుకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే ప్రధాని మోడీ మాత్రం టీడీపీతో కలిసి పోరాటం చేసే విషయంలో ఇప్పుడే ఏమీ చెప్పకపోవడంతో పవన్ కూడా పొత్తుల విషయంలో మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. ఒకవేళ పవన్ ప్రతిపాదనకు మోడీ అంగీకరించి ఉంటే ఆ విషయాన్ని చెబుదామని మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జనసేనకు ఈ మేరకు ఝలక్ తగినట్లయింది. దీంతో పవన్ కూడా మోడీతో భేటీలో ప్రస్తావనకు వచ్చిన విషయాల్ని చెప్పకుండా మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది.