PM Modi: ఎన్నికల వేళ ఏపీకి ప్రధాని మోడీ వరాలు-ఒకటికి మూడు..
ఏపీకి రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా కేంద్రం పలు జాతీయ విద్యాసంస్ధల్ని ఇచ్చింది. వీటి క్యాంపస్ లు ఎప్పుడో నిర్మాణం ప్రారంభమైనా పూర్తి కావడం మాత్రం ఆలస్యమైంది. దీంతో ఐఐఎం, ఐఐటీ వంటి సంస్ధలు తాత్కాలిక క్యాంపస్ లలోనే కాలం వెళ్ల దీస్తున్నాయి. ఇలాంటి వాటిలో వైజాగ్ ఐఐఎం, తిరుపతి ఐఐటీ వంటివి ఉన్నాయి. వీటిని ప్రధాని మోడీ ఇవాళ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు.

విభజన హామీల్లో భాగంగా ఏపీకి కేటాయించిన వైజాగ్ ఐఐఎం, తిరుపతి ఐఐటీలను గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఏర్పాటు చేసింది. అయితే వాటికి అవసరమైన రెగ్యులర్ క్యాంపస్ ల నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. దీంతో 2016 నుంచి తాత్కాలిక క్యాంపస్ లలోనే వీటిని నడపాల్సి వచ్చింది. అయితే ఇన్నేళ్లకు నిర్మాణాలు పూర్తి చేసుకోవడంతో వాటిని ప్రధాని మోడీ ప్రారంభించారు. అదే సమయంలో కర్నూలు ట్రిపుల్ ఐటీని సైతం ప్రధాని మోడీ ఇవాళ జాతికి అంకితం చేశారు.
తిరుపతి ఐఐటీ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ, అక్కడే శ్రీనివాసపురంలోని ఐసర్ భవనాన్ని సైతం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. గతంలో ఏపీ విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ ప్రధాని మోడీ ఈ క్యాంపస్ లను ప్రారంభించడం బీజేపీకి ఊరట కానుంది. అసలే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని జనంలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్న కాషాయ పార్టీకి ఇవాళ జరిగిన ప్రారంభోత్సవాలు ఊరటగానే చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications