మోడీకి 'ఆంధ్రా'రుచి, నాసి దుస్తులపై రాజధాని రైతు ఆగ్రహం, ఖంగుతిన్న అధికారులు
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు రానున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సర్కారు ఆంధ్రా వంటకాలతో కూడిన ప్రత్యేక వంటకాలను సిద్ధం చేయనుంది. మెనూ ఖరారు విషయంలో ప్రధాన మంత్రిత్వ కార్యాలయం (పీఎంఓ) కూడా పలు సూచనలు, సలహాలు చేసినట్లుగా తెలుస్తోంది.
అయినా శరన్నవరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న మోడీ సాధారణంగా భోజనం చేయరు. అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏర్పాటు చేసిన స్పెషల్ డిన్నర్లోనూ ప్రధాని మోడీ ఏం తినలేదు. కేవలం తన ఆచారం ప్రకారం తేనె కలిపిన నిమ్మరసం మాత్రమే తాగారు.
అయితే అమరావతి శంకుస్థాపన రోజున దసరా కావడంతో అదే రోజున ప్రధాని మోడీ ఉపవాస దీక్షను విరమిస్తారు. అయితే శంకుస్థాపన కార్యక్రమం ముగిసే సమయానికి మోడీ ఉపవాస దీక్షను విరమిస్తారా? లేదా? అన్న విషయం వెల్లడి కావాల్సి ఉంది.
ఒకవేళ మోడీ ఇంకా ఉపవాస దీక్షలోనే ఉంటే కనుక కేవలం తేనె కలిపిన నిమ్మరసంతోనే సరిపెడతారు. అలా కాకుండా ఉపవాస దీక్ష విరమించితే మాత్రం ఆంధ్రా ప్రత్యేక వంటకాలు మోడీకి రుచి చూపించనున్నారు. మోడీ భోజనం చేస్తే అందులో ఉలవచారు ఉండాలని పీఎంఓ అధికారులు సూచించారని సమాచారం.
ప్రభుత్వం ఇచ్చిన వస్త్రాలపై రైతుల అసంతృప్తి
రాజధానికి భూములిచ్చిన రైతులను ప్రభుత్వం బట్టలతో సత్కరిస్తోంది. ఇందులో భాగంగా చాలామంది రైతులకు ఇప్పటికే బట్టలు అందాయి. మహిళలకు పట్టుచీర, మగవారికి ధోవతులు ఇస్తున్నారు. అయితే, ఇవి నాసిరకంగా ఉన్నాయని రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
తమకు చౌక దుస్తులు ఇచ్చి అవమానిస్తున్నారని తుళ్లూరు మండల రైతులు ఆరోపించారు. మంత్రులు చెప్పినట్టుగా వీటి ఖరీదు రూ.2,300 కాదుకదా, రూ.700 కూడా విలువ చేయవంటున్నారు. అమరావతికి భూములిచ్చిన రైతుల మధ్యలో కూడా ఏపీ సర్కారు తేడాలు చూపిందని వారు దుయ్యబట్టారు.
మంత్రులు నేలపాడులో పంపిణీ చేసిన వస్త్రాలు మాత్రమే నాణ్యంగా ఉన్నాయని, మిగతా అన్ని చోట్లా అధికారులు ఇస్తున్న దుస్తులు ఎంతమాత్రమూ బాగాలేవని ఆరోపిస్తున్నారు. తుళ్లూరు మండలంలోని అబ్బరాజుపాలెం, అనంతవరం, తుళ్లూరు, రాయపూడి గ్రామాల రైతులు తమకిస్తున్న పట్టుచీర, ధోవతులు అక్కర్లేదని చెప్పారు.
అనంతవరం గ్రామ రైతులు.. ఇవి తమకు వద్దంటూ సీఆర్డీఏ అధికారుల ముందు వాదనకు దిగారు. వాటిని వెనక్కిచ్చేశారు. వీటిని వడియాలు పెట్టుకునేందుకు కూడా వాడలేమని విమర్శించారు. దీంతో ఖంగుతిన్న అధికారులు వేరే వస్త్రాలు తెప్పిస్తామని చెప్పి వాటిని వెనక్కు తీసుకెళ్లారు.
తొలి రెండు రోజులూ చీర, ధోవతిలతో పాటు స్వీట్ బాక్స్ ఇచ్చిన అధికారులు ఆదివారం నాడు దాన్ని విస్మరించడం విమర్శలు లేవనెత్తింది. ఇది తమను అవమానించడమేనని రైతులు ఆరోపించారు. తొలుత ఇచ్చిన ఆహ్వాన పత్రికల్లో రెండు పాస్లను ఇచ్చిన అధికారులు, ఇప్పుడు ఒకే పాస్ పెట్టడం పైనా మండిపడ్డారు.