మోడీ రోడ్ మ్యాప్ పార్ట్ -2 స్టార్ట్ ? చంద్రబాబు చుట్టూ వల ? పవన్ చేతికి మట్టి అంటకుండా జగన్ తో !
ఏపీలో రాజకీయాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకునేందుకు ఎప్పటినుంచో తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి వైసీపీని దూరం చేసుకోవడం మాత్రం ఇష్టం లేదు. దీంతో ప్రస్తుతానికి విపక్ష స్ధానం ఆక్రమించేందుకు ప్రయత్నించాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ కు రోడ్ మ్యాప్ ఇచ్చిన ప్రధాని మోడీ..ఇప్పుడు దాని పార్ట్ 2 అమలు మొదలుపెట్టేశారా
అన్న చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ దాడుల విషయంలో పవన్ మౌనంగానూ, వైసీపీ దూకుడుగానూ ముందుకెళ్తున్నట్లు సమాచారం.

పవన్ కు మోడీ రోడ్ మ్యాప్
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబును కూడా కలుపుకుని ముందుకెళ్లేందుకు బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ కోరిన పవన్ కళ్యాణ్ కు పవన్ తాను అనుకున్న రోడ్ మ్యాప్ ఇచ్చేశారు. అయితే ఇందులు చంద్రబాబు లేరు. కేవలం బీజేపీ-జనసేన మాత్రమే ఉన్నాయి. అయితే ఈ రెండు పార్టీలు బలపడాలంటే రాజకీయ శూన్యత ఏర్పడాలి. అలా జరగాలంటే అడ్డున్నది చంద్రబాబు మాత్రమే. ఆయన్ను తమ రాజకీయంతో దారిలోకి తెచ్చుకోవడం లేదా భయపెట్టి దారికి తెచ్చుకోవడమో చేయాల్సి ఉంటుంది. ఇందులో రెండో మార్గాన్ని బీజేపీ ఎంచుకుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

టీడీపీ టార్గెట్ గా ఈడీ దాడులు
రాష్ట్రంలో కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న ఈడీ దాడుల్ని గమనిస్తే ఇవి టీడీపీని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టార్గెట్ చేసేలాగే ఉన్నాయి. ముఖ్యంగా గత టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి ఈడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తోంది. ఇందులో భాగంగానే పలువురికి నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతోంది. ముందు ఆస్పత్రులపై దాడులు మొదలుపెట్టిన ఈడీ.. అనంతరం చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన స్కిల్ కార్పోరేషన్ వరకూ వచ్చేసింది. దీంతో ఈడీ దాడుల అసలు లక్ష్యం టీడీపీయేనన్న చర్చ సాగుతోంది.

పవన్ మౌనం-జగన్ విమర్శలు
రాష్ట్రంలో సాగుతున్న ఈడీ దాడులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటున్నారు. ఎన్నారై, అక్కినేని ఆస్పత్రులపై దాడులపై కానీ, స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కాంపై దర్యాప్తుపై కానీ పవన్ కళ్యాణ్ నేరుగా స్పందించడం లేదు. అలాగే జనసేన నేతలు కూడా మౌనంగానే ఉంటున్నారు. కానీ వైసీపీ మాత్రం దూకుడుగా విమర్శలు చేస్తోంది. ఆస్పత్రులపై ఈడీ దాడుల్ని టీడీపీకి లింక్ చేస్తూ వైసీపీ అనుకూల మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే ఈ విషయం ఇట్టే అర్దమవుతుంది. అలాగే స్కిల్ కార్పోరేషన్ స్కాం విషయంలో అయితే ఇది నేరుగా చంద్రబాబు ఏర్పాటు చేసిన సంస్ధే కావడంతో దీనిపై దర్యాప్తు విషయంలో చంద్రబాబును వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ నేతలు కూడా చంద్రబాబు దీనిపై స్పందించాలని డిమాండ్లు చేస్తున్నారు.

మోడీ రోడ్ మ్యాప్ పార్ట్ 2 ?
పవన్ కళ్యాణ్ కు మోడీ గతంలో ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం చంద్రబాబు లేకుండానే ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపేలా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇది జరగాలంటే చంద్రబాబును, టీడీపీని టార్గెట్ చేయాల్సిందే. అయితే ఇది తాము నేరుగా చేసే కంటే వైసీపీ ద్వారా చేయించాల్సిందే. అప్పుడు అది పైకి జగన్, చంద్రబాబు మధ్య వార్ లా మాత్రమే కనిపిస్తుంది. టీడీపీని కేంద్ర దర్యాప్తు సంస్ధల ద్వారా టార్గెట్ చేయించి దానిపై విమర్శలు మాత్రం వైసీపీ ద్వారా చేయించాలన్న ప్లాన్ లో భాగంగానే తాజా రాజకీయం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది భవిష్యత్తులో బీజేపీ-జనసేన కూటమికి వరంగా మారుతుందా లేక చంద్రబాబుపై సానుభూతి పెరిగి ఆయనకు అనుకూలంగా మారుతుందా అన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications