కోటాపై మోడీ సంచలన వ్యాఖ్యలు: చంద్రబాబుకు గురిపెట్టి..
అమరావతి: వేరే రాష్ట్రం గుజరాత్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోడి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో సమస్యను ప్రస్థావిస్తూ దానికి జవాబుగా ప్రధాని ఇచ్చిన క్లారిటీలా ఆ వాక్యాలు కనిపిస్తున్న అవి మన రాష్ట్రం పైనే ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. పైగా అసలు మోడి ఆ మాటలు చంద్రబాబుని ఉద్దేశించే మాట్లాడివుంటారనే విశ్లేషణలు కూడా జోరుగా సాగుతున్నాయి.
ప్రధాని మోడి గుజరాత్ లో ఎక్కడ ఏమి మాట్లాడారు? ఆ మాటలకు మన రాష్ట్రానికి సంబంధం ఏమిటి? చంద్రబాబుని ఉద్దేశించే మోడి మాట్లాడి ఉంటారనే ఊహాగానాలు చెలరేగడానికి కారణం ఏమిటి? అసలు గుజరాత్ లో మోడి ఏం మాట్లాడారు...ఈ వివరాలు తెలుసుకునే ముందు ఒక్క విషయం గుర్తు తెచ్చుకుందాం...ఎపి ప్రభుత్వం మూడు రోజుల క్రితం కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మాన చేసిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని కేటగిరిల రిజర్వేషన్లు 50 నుంచి 55 శాతానికి పెరిగిన విషయమూ తెలిసిందే...సో...ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడి గుజరాత్ లో రిజర్వేషన్ల గురించి మాట్లాడారు... అంతేకాదు చాలా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
మోడి ఏమన్నారు...
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోడి మాట్లాడుతూ రిజర్వేషన్ల గురించి కుండబద్దలు కొట్టేశారు. అందులోను సూటిగా సుత్తి లేకుండా డైరెక్టుగా పాయింట్ కొచ్చేశారు. దేశంలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి అవకాశం లేదు. 50 కి మించి ఎవరైనా రిజర్వేషన్లు ఇస్తామని అంటే అది నిజం కాదు...55 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎవరైనా చెబితే అది తప్పుడు హామీ అవుతుందన్నారు. అంతేకాదు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సుప్రింకోర్టు విధించిన యాబైశాతం పరిమితిని దాటే ఉద్దేశ్యం తమకు లేదని డైరెక్టుగా బహిరంగ వేదిక మీద ప్రకటించేశారు.
ఈ వ్యాఖ్యల అంతరార్థం ఏమిటి?
ప్రస్తుతం మన రాష్ట్రంలో మనం ఉన్న పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలకు మనకు సంబంధం లేదని అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒక వేళ టిడిపి నాయకులని ఇదే విషయం గురించి ప్రశ్నిస్తే అబ్బే వాటితో మనకు సంబంధం లేదని చెప్పగలరా? కాబట్టే ఇప్పుడు ప్రధాని మోడి చేసిన ఈ వ్యాఖ్యలు టిడిపి నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గుజరాత్ లో మోడి చేసిన ఈ వ్యాఖ్యలు మన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మోడీ మాటల ప్రకారం చంద్రబాబుది తప్పుడు హామీనే అని తేలిపోయినట్లే కదా అని ప్రత్యర్థులు నొక్కివక్కాణిస్తున్నారు. పైగా మోడి మాట్లాడిన ధోరణిని బట్టి ఇవి చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే అని ఆయనంటే గిట్టనివారు బల్లగుద్ది చెబుతున్నారు. మరికొందరేమో చంద్రబాబుని మోడీ టార్గెట్ చేసినా చెయ్యకపోయినా ఆ మాటలైతే చంద్రబాబును ఇబ్బందుల్లోకి నెట్టేవే కదా అని విశ్లేషణలు చేస్తున్నారు.
మూన్నాళ్ల ముచ్చటన్నా తీరలేదు...
కాపు రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులో వేసేశాము...ఇంక లాభమో నష్టమో వారి ద్వారానే అనేలా వ్యవహరించిన ఎపి లోని టిడిపి ప్రభుత్వానికి ప్రధాని మోడి వ్యాఖ్యలు దిమ్మతిరిగేలా చేసి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాపులకు రిజర్వేషన్లు కల్పించామన్న ఆనందం మూడు రోజులైనా నిలవలేదు. అప్పుడే ఇంత త్వరగా అదీ ప్రధాని మోడి స్వయంగా రిజర్వేషన్ల బంతిని ఇలా సిక్సర్ కొడతారని ఎవరూ ఊహించలేదు.టిడిపి నేతలైతే అసలే ఊహించలేదు.
పర్యవసానాలు ఎలా ఉంటాయి?
మోడి తాజా ప్రకటన ప్రకారం ఏపి అసెంబ్లీ కాపు రిజర్వేషన్లపై చేసిన తీర్మానాన్ని కేంద్రం అమోదించే అవకాశాల్లేవు. ఏపికి వర్తించే విధానమే తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లకూడా వర్తిస్తుందని మోడి మాటలతో స్పష్టమైపోయింది. విద్య, ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలని కొన్ని ఉన్నత సామాజిక వర్గాలు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. రాజస్థాన్, హరియాణాల్లో గుజ్జర్లు, ఝాట్లు, గుజరాత్లో పటేళ్లు తమకూ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి కూడా. అలాగే ఏపీలోనూ కాపుల ఉద్యమం కూడా రైలు విధ్వంసానికి కారణమైంది. తెలుగు రాష్ట్రాల్లో కాపులకు ఏపీలో 5 శాతం, తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే గుజరాత్లో పటేళ్ల ఆందోళనకు భాజపా ప్రభుత్వం అంతగా ప్రాధాన్యతను ఇవ్వలేదు. రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలిస్తామని చెప్పినప్పటికి దీని గురించి ఆలోచించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ వారిని అక్కునచేర్చుకుంది. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటీదార్లు తమ మద్దతును కాంగ్రెస్కు ప్రకటించారు. పటేళ్ల రిజర్వేషన్ల అంశాన్ని ఎన్నికల ప్రచారంలో యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తామని ఎవరైనా చెబితే అది తప్పుడు హామీయే అనే ఒక్క మాటతో అందరికీ క్లారిటీ ఇచ్చేశారు.
ప్రధాని నోట సుప్రీం మాట...
50 కి మించి ఎవరైనా రిజర్వేషన్లు ఇస్తామని అంటే అది నిజం కాదు...55 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎవరైనా చెబితే అది తప్పుడు హామీ అవుతుందన్న ప్రధాని విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సుప్రింకోర్టు విధించిన యాబైశాతం పరిమితిని దాటే ఉద్దేశ్యం తమకు లేదని కూడా తేల్చి చెప్పారు. ప్రధాని ఇంత స్పష్టంగా మాటలాడటం, పైగా సుప్రీం కోర్టు ఆదేశాలను ఉదహరించడం ఆయన ఏమి స్ఫష్టం చెయ్యదల్చుకున్నారో అర్థం అవాల్సిన వారందరికి అర్థం అయింది. ఇటీవలే రాజస్థాన్ ప్రభుత్వం ఝాట్లకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోగా దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని తీర్పును వెలువరించడం గమనార్హం.
చంద్రబాబుకు మోడీ ఝలక్...
మిగతా రాష్ట్రాల సంగతి అటుంచితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు మోడి వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఆఘమేఘాల మీద నడిపించిన ఎపి సిఎం చంద్రబాబు కొరియా పర్యటనలో ఉండటం వల్ల మోడీ వ్యాఖ్యలపై ఆయన ప్రతిస్పందన తీసుకునే అవకాశం లేదు.ఆయన విదేశీ పర్యటన ముగిసి భారత్ కు చేరుకోగానే ఎదురయ్యే ప్రశ్నల పరంపరకు ధీటైన జవాబు ఎలా ఇస్తారో వేచి చూద్దాం...