ప్రధాని మోదీ చేసింది..జగన్ చేయలేరా : ఆ మంత్రులకు కుదుపు -డిప్యూటీలు మార్పు : సీఎం కొత్త సమీకరణాలు..!!
ఏపీలో రెండున్నారేళ్ల పాలన ముగుస్తూనే కేబినెట్ ప్రక్షాళన తప్పదని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. సమయం సమీపిస్తున్న కొద్దీ మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ప్రస్తుత మంత్రుల్లో ఎవరు పదువులు కోల్పోయేది పార్టీలో ఇప్పటికే ప్రచారం సాగుతోంది. ఇక, సీనియర్లు మాత్రం తమకు ఇబ్బంది లేదనే ధీమాతో ఉన్నారు. కానీ, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు మాత్రం సీనియర్లలోనూ వేటు పడే వారు ఉన్నారంటూ తేల్చి చెబుతున్నారు.

మోదీ చేసింది జగన్ చేయలేరా..
ఇదే సమయంలో..కేంద్ర కేబినెట్ విస్తరణ పూర్తయింది. కొంత కాలంగా అనేక ప్రచారాలు సాగినా..ఎవరికీ అందని లెక్కలతో మోదీ-షా ద్వయం తమ 2024 టీం ను రెడీ చేసుకున్నారు. మొత్తంగా సీనియర్లను దాదాపుగా పక్కన పెట్టేసారు. కేవలం..గడ్కరీ..రాజ్ నాధ్ మాత్రమే సీనియర్లుగా కనిపిస్తున్నారు. పార్టీ కోసం పని చేసిన వారు..విద్యావేత్తలు..యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. తాము లేకుంటే పార్టీ లేదు..ప్రభుత్వం లేదనే విధంగా మంత్రులు వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. జగన్ సైతం కేబినెట్ లో మార్పులు - చేర్పులు చేసి 2024 ఎన్నికల టీం సిద్దం చేసుకోవటానికి రెడీ అవుతున్నారు.

సీనియర్ల పైనా వేటు ఖాయం..
అందులో కొందరు సీనియర్ల పైనా వేటు తప్పదని భావిస్తున్నారు. మంత్రులుగా ఉన్న కొందరిని పార్టీ సేవలకు వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. పార్టీ పరంగా పదవులు పొందని సీనియర్లు మంత్రులుగా అవకాశం పొందనున్నారు. అదే సమయంలో..ఇప్పటి వరకు మంత్రులుగా ఉన్న వారిలో ఇద్దరు సీనియర్లు మినహా మిగిలిన వారిని పార్టీ సేవలకు పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో ఉత్తరాంధ్రకు చెందిన ఒక సీనియర్ మంత్రితో పాటుగా..రాయలసీమ కు చెందిన మరో మంత్రి..దక్షిణ కోస్తాలోని మరో సీనియర్ మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయి. ఆ సీనియర్ల స్థానంలో అవకాశం దక్కని సీనియర్లకు ఛాన్స్ ఇవ్వనున్నారు.

పార్టీ సేవలకు వినియోగం..
ఇప్పటికే 13 జిల్లాలకు ముఖ్యమంత్రి సమన్వయకర్తలను నియమించారు. అదే విధంగా ఇన్ ఛార్జ్ మంత్రులు ఉన్నారు. వీరు ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలు చూస్తున్నా...క్షేత్ర స్థాయిలో పార్టీ వ్యవహారాలు మాత్రం ఎవరూ పట్టించుకోవటం లేదనే సమాచారం ముఖ్యమంత్రికి చేరింది. నిఘా వర్గాలు..సర్వే సంస్థల ద్వారా సీఎం ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా.. మొత్తం కేబినెట్ లో 18 మందిని మారుస్తారనే ప్రచారం ఇప్పటికే పార్టీ వర్గాల్లో మొదలైంది. వారి స్థానాల్లో పక్కాగా సామాజిక- ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఎవరికి అవకాశం దక్కుతుందనే లెక్కలు మొదలయ్యాయి. అయితే, మహిళల సంఖ్య ప్రస్తుతం మూడు గా ఉండగా..అది నాలుగుకు పెరగనున్నట్లు సమాచారం.

డిప్యూటీ సీఎంల స్థానాల మార్పు..
ఎస్సీ వర్గంలో డిప్యూటీ సీఎం పదవి కోస్తాకు దక్కనుంది. సీమకు బీసీ కేటగిరీలో డిప్యూటీ సీఎం కేటాయించనున్నారు. ఉత్తరాంధ్ర కు ఎస్టీ కేటగిరీలో..గోదావరి జిల్లాలకు కాపు కేటగిరీ లో డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నట్లు విశ్వసనీయ సమాచారం. జగన్ తన తొలి కేబినెట్ లో సామాజిక సమీకరణాలను పక్కాగా పాటించారు. నాటి నుండి ఇప్పటి వరకు అన్ని నిర్ణయాల్లోనూ అదే విధమైన పాలసీ అమలు చేస్తున్నారు. తాజాగా..జగన్ సొంత బాబాయ్ రాజ్యసభ కోరగా..పార్టీ వ్యవహారాలు చూడాలని జగన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
పార్టీ తరువాతనే ఎవరైనా అంటూ జగన్ తేల్చి చెప్పారని సమాచారం. దీంతో..సీనియర్ మంత్రులకు సైతం పదవీ గండం పొంచి ఉందనేది స్పష్టమవుతోంది. ఇక, ఈ సమీకరణాలు పార్టీ కోసం పని చేసిన వారిలో జోష్ నింపుతోంది. దీని ద్వారా 2024 టీంలో సీనియర్లు- యూత్-ఫైర్ బ్రాండ్ల తో కలగలిపిన కేబినెట్ సిద్దం కానున్నట్లు సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications